Polaa Sudha, News18, Nellore.
మోసపోయే వాళ్లు ఉండాలి కానీ.. కొత్త కొత్త దారులు వెతుక్కుంటున్నారు కేటగాళ్లు.. కఠిన చట్టాలు ఉన్నా.. అందరికీ అవగాహన కల్పిస్తున్నా.. మోసాలు మాత్రం రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. మాటలతో మభ్యపెట్టారు.. డబ్బు ఆశ చూపించారు.. ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించారు. వేయి, పది వేలు కాదు.. రెండింతలు ఇస్తామని మాయ చేశారు. ఆరు నెలలు గడవకముందే కోట్లు కొట్టేసి బోర్డు తిప్పేశారు. దీంతో బాధితులంతా లబోదిబోమంటున్నారు. అయితే ఈ ఘటన కర్ణాటకలో జరిగినా.. దాని మూలాలు మాత్రం నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. నిందితులను పట్టుకునేందుకు కర్నాటక సైబర్ క్రైమ్ టీమ్ రంగంలోకి దిగింది. ఈ అక్రమాలకు పాల్పడిన కేటుగాళ్ళు నెల్లూరోళ్ళు కావడంతో.. అధికారులు నెల్లూరుకి చేరుకున్నారు.
నెల్లూరుకు చెందిన ముగ్గురు వ్యక్తులు కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో గతేడాది టెన్ఫోర్డ్ పేరుతో ఆన్లైన్ ట్రేడింగ్ కంపెనీ ప్రారంభించారు. నగరానికి చెందిన వెంకటేశ్వర్లు, డైకాస్ రోడ్డుకు చెందిన మల్లికార్జున్, పొదలకూరుకు చెందిన జగన్మోహన్లు కలిసి దీన్ని మొదలుపెట్టారు.
ఈ సంస్థలో బళ్ళారికి చెందిన కొంతమందిని భాగస్వామ్యం చేసుకున్నారు. తమ సంస్థలో డబ్బు డిపాజిట్ చేస్తే ఆరు నెలల్లో రెండింతలు నగదు ఇస్తామని ప్రకటనలు గుప్పించారు. దీంతో స్థానిక ప్రజలంతా ఆ సంస్థలో పెద్దమొత్తంలో డిపాజిట్లు పెట్టారు. చిన్న చితకా, సామాన్యులు కూడా డిపాజిట్లు చేసిన వారిలో ఉన్నారు. ఇలా ప్రజలను మభ్యపెట్టి 2 కోట్ల రూపాయల వరకు డిపాజిట్లు సేకరించారు.
ఇదీ చదవండి : ఆదాయం పెరగాలంటే ఈ రోజు అమ్మవారిని దర్శించుకోండి.. బాలా త్రిపుర సుందరీ దేవిగా అలంకారం
ఇక వచ్చింది చాలు అనుకున్నారు…బోర్డు తిప్పేశారు. ఆరు నెలలు గడవక ముందే బోర్డు తిప్పేసి పరారయ్యారు. దీంతో బాధితులంతా బళ్ళారి ఎస్పీ వద్ద తమ గోడును వెళ్ళగక్కారు. తమకు న్యాయం చేయాలని అభ్యర్ధించారు. దీంతో ఈ కేసును సైబర్ క్రైమ్ టీంకు అప్పగించారు. రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ టీమ్.. దర్యాప్తు ప్రారంభించింది. నిందితులు ఎవరన్న దానిపై ఆరా తీశారు.
ఇదీ చదవండి : నేడు తిరుమలకు సీఎం జగన్ .. శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. ఈ సారి సామాన్యులకు అదిరే ఆఫర్
ఆ సంస్థలో భాగస్వామ్యంగా ఉన్న బళ్ళారికి చెందిన కొందరిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారి ద్వారా అసలు సూత్రధారులను నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు, మల్లికార్జున్, జగన్మోహన్లుగా నిర్ధారించుకున్నారు. బళ్ళారి నుంచి నేరుగా నెల్లూరుకి చేరుకున్నారు. సిబ్బంది వేణుగోపాల్, శివమూర్తితో కలిసి సైబర్ క్రైమ్ ఎస్సై దాదావలి నెల్లూరుకు వచ్చారు. పొదలకూరు, నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాల్లో నిందితుల కోసం గాలించారు.
అయితే వారి ఆచూకీ లభించకపోవడంతో .. నెల్లూరు పోలీసు ఉన్నతాధికారులను సంప్రదించి.. కేసు వివరాలను నిందితుల వివరాలను అందచేశారు. ఈ కేసులో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బళ్లారి సైబర్ క్రైమ్ టీమ్ ఇచ్చిన ఆధారాలతో నెల్లూరు పోలీసులు కూడా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Crime news, Local News, Nellore Dist