హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Telugu Travellers: యూట్యూబ్‌లో అడ్డగోలు వసూళ్లు.. వివాదాలు.. పరువు తీస్తున్న తెలుగు ట్రావెలర్స్

Telugu Travellers: యూట్యూబ్‌లో అడ్డగోలు వసూళ్లు.. వివాదాలు.. పరువు తీస్తున్న తెలుగు ట్రావెలర్స్

ఉమా, అన్వేష్, రవి

ఉమా, అన్వేష్, రవి

Telugu Travellers: యూట్యూబ్ వేదికగా..  తెలుగు ట్రావెలింగ్ కమ్యూనిటీలో రచ్చ రచ్చ జరుగుతోంది. వీళ్లు తమ అభిరుచిని వ్యాపారంగా మార్చేసి.. పెద్ద సెలబ్రిటీల్లా ఫీలవుతున్నారని వీక్షకులు విసుక్కుంటున్నారు

(బాలకృష్ణ, న్యూస్ 18 ప్రతినిధి)

ఒక‌ప్పుడు  భిక్షాటన చేసేవారు గుడి ముందు మాత్ర‌మే క‌నిపించేవారు.  రోజులు మారిన తర్వాత  రోడ్ల మీద,  ట్రాఫిక్ సిగ్న‌ల్స్ ద‌గ్గ‌ర ఎక్కువగా ఉంటున్నారు.  అయితే ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో భిక్షాటన కాస్త ట్రెండీగా మారిపోయింది. యూట్యూబ్ (Youtube) వేదిక‌గా డబ్బులు దండుకునే వారు ఎక్కువయ్యారు. ముఖ్యంగా ట్రావెలింగ్ వీడియోలు (Travelling Videos) చేసే యూట్యూబర్స్ డబ్బు సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఐతే అందరూ కాదు. ట్రావెలింగ్‌పై మక్కువతో  జెన్యూన్‌గా వ్లాగ్స్ చేసే వారు చాలా మందే ఉన్నారు. కానీ కొందరు మాత్రం.. ట్రావెలింగ్ పేరుతో  సబ్‌స్క్రైబర్స్‌ని డబ్బులు అడుగుతున్నారు.  నిజంగా తక్కువ  రెవెన్యూ వచ్చి.. ఇబ్బందులు పడుతున్న వాళ్లైతే.. సబ్‌స్క్రైబర్స్ సాయం కోరొచ్చు. కానీ నెలనెలా లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్న వారు కూడా.. జనాల నుంచి డబ్బులు అడగడమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. కొత్త వివాదానికి తెరతీసింది.

యూట్యూబ్ వ్లాగ్స్  (Youtube vlogs)అనేవి ఇప్పుడు స‌ర్వసాధార‌ణమయ్యాయి.  కొందరు సరదాగా కోసం చేస్తుంటే.. ఇంకొందరు దీనినే కెరీర్‌గా ఎంచుకుంటున్నారు.  సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు.. ఎంతో మంది తమ అభిరుచికి తగినట్లుగా.. జనాలకు నచ్చే వీడియోలు తీస్తూ... నిత్యం వ్లాగ్స్  చేస్తూ యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే ఇందులో కొంద‌రు మాత్రం రూట్ మార్చారు. తాము అనుకున్నంత మంది స‌బ్‌స్క్రైబర్స్ వచ్చిన త‌రువాత..  వారి నుంచి డబ్బులు దండుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. తాజాగా తెలుగు యూట్యూబ్ క‌మ్యూనిటీలో ఇదే అంశంపై ర‌చ్చ జ‌రుగుతుంది. తెలుగులో చాలామంది యూట్యూబ‌ర్ మంచి మంచి కంటెంట్స్‌తో వీక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంటే.. మ‌రికొంత మంది మాత్రం కంటెంట్‌ను ప‌క్క‌న పెట్టి ... కాంట్రవర్సీ చేస్తున్నారు. ఒక‌రి పై ఒక‌రు తిట్ల పురాణం మొదలు పెట్టారు. వ్య‌క్తిగ‌త గొడ‌వ‌ల‌ను ప‌బ్లిక్ ప్లాట్ ఫార‌మ్స్ లోకి తీసుకొచ్చి తెలుగు యూట్యూబ‌ర్స్ ఇంత చిల్ల‌ర‌గా ఉంటారా... అనే  విధంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు.

Vande Bharat Train: తెలంగాణకు వందే భారత్ ట్రైన్... దీపావళి నుంచి పరుగులు

తెలుగులో ట్రావెలింగ్ వీడియోలు చూసే వారికి 'ఉమా తెలుగు ట్రావెలర్' (Uma Telugu traveller) సుపరిచితమైన వ్యక్తి. ఈయన వీడియోలకు లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఒక సాధార‌ణ కుటుంబం నుంచి వ‌చ్చిన ఉమ.. ట్రావెలింగ్‌పై మ‌క్కువ‌తో యూట్యూబ్‌లో వ్లాగులు చేయ‌డం ప్రారంభించాడు.  మొదట్లో ఆఫ్రికా దేశం మాలిలో ఉద్యోగం చేసుకుంటూ.. ఖాళీ సమయాల్లో యూట్యూబ్ వ్లాగ్స్ చేసేవాడు.  ఆ వీడియోలు బాగుండ‌డంతో  పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. తక్కువ సమయంలో లక్షల్లో సబ్‌స్క్రైబర్స్ వచ్చారు.  ప్ర‌ముఖ మీడియాల్లో కూడా ఇత‌ని గురించి ఆర్టిక‌ల్స్, కథనాలు రావ‌డంతో మరింత ఆదరణ పెరిగింది. ప్రతి వీడియోకు మిలియన్లో వ్యూస్ వస్తున్నాయి. ఐతే ఉమా MCN (మల్టీ ఛానెల్ నెట్‌వర్క్‌) కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాడని.. ఆయన వీడియోలకు వచ్చేవన్నీ ఆర్టిఫిషియ‌ల్ వ్యూస్ అని తోటి యూట్యూబ‌ర్ అన్వేష్ బయటపెట్టారు. మొదట యూట్యూబ్‌లోకి అభిరుచి పేరుతో వచ్చిన ఉమా.. క్రమంగా దానిని వ్యాపారంగా మార్చేశారనే విమర్శలున్నాయి. మిలియన్స్ వ్యూస్‌తో లక్షలు సంపాదిస్తున్న ఉమా తెలుగు ట్రావెలర్.. ఈ మధ్య ఓ వీడియోను పోస్ట్ చేశారు. తాను చాలా క‌ష్టాల్లో ఉన్నాన‌ని, త‌న‌కు అంద‌రు ఆర్ధిక స‌హాయం చేయాల‌ని సబ్‌స్క్రైబర్స్‌ని అభ్యర్థించాడు. నెలనెలా భారీగా ఆదాయం పొందే ఆయన.. ఇలా చేయడమేంటని పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. ఆ వీడియోను డిలీట్ చేశాడు. తెలుగు ట్రావెలింగ్ కమ్యూనిటీలో పెద్ద యూట్యూబర్‌గా పేరున్న ఉమా.. జనాలను డబ్బులు అడగడంపై వివాదం చెలరేగింది. ఆయన తీరుపై ఇతర యూట్యూబర్స్, కొందరు సబ్‌స్క్రైబర్స్ మండిపుతున్నారు.

 రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. తిరుపతికి స్పెషల్ ట్రైన్స్.. తేదీలు, టైమింగ్స్ వివరాలివే

తెలుగులో ట్రావెలింగ్ వీడియోలు చేస్తూ.. జనాలకు దగ్గరైన వారిలో రాజారెడ్డి, అన్వేష్ కూడా ఉన్నారు. ముందుగా రాజారెడ్డి (Telugu Traveller) గురించి మాట్లాడుకుంటే.. తక్కువ బడ్జెట్‌లో ట్రావెలింగ్ ఎలా చేయాలి? ఎక్కడ ఉండాలి? ఎక్కడ తినాలి? వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఏయే ప్రాంతాల్లో పర్యటించవచ్చు? అనే సమగ్ర వివరాలతో వీడియోలు చేస్తుంటాడు. ఇలాంటి వీడియోలు చేసిన మొట్ట మొదటి తెలుగు యూట్యూబర్‌గా ఆయనకు పేరుంది. రాజారెడ్డి ఇచ్చే సమాచారం ఎంతో మందికి ఉపయోగపడింది. యూట్యూబ్‌లో రాజారెడ్డి కూడా బాగానే ఫాలోవర్స్ ఉన్నారు. ఏదైన ఒక కొత్త ప్రాంతానికి వెళ్లాంటే ఇత‌ని వీడియోలు ఒక మంచి రెఫ‌రెన్స్‌గా కూడా ప‌ని చేస్తాయి. ఇప్పుడున్న తెలుగు ట్రావెలర్స్ అంద‌రు రాజారెడ్డిని చూసే త‌మ ట్రావెల్ వ్లాగ్స్ ప్రారంభించార‌నుకోవచ్చు.

'నా అన్వేషణ'  (Naa Anveshana)ఛానెల్‌కు కూడా క్రేజ్ బాగుంది. తాను పర్యటించే ప్రాంతాల గురించి సమగ్ర సమాచారం అందిస్తుంటాడు అన్వేషన్. అక్కడి భాష సంప్ర‌దాయ‌ల‌పై త‌క్కువ సమ‌యంలోనే ప‌ట్టు సంపాదించి.. స్థానికులతో క‌లిసిపోవ‌డం ఈయన ప్ర‌త్యేక‌త. అమెరికా నుంచి ఇండియాకు రాకాసి నౌక యాత్ర, ఆల్ ఇండియా ట్రిప్‌తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. అంతేకాదు తెలుగు ట్రావెలర్స్‌లో మరెవరికీ సాధ్యం కాని.. అంటార్కిటికా యాత్ర చేసి... శభాష్ అనిపించుకున్నాడు. అంద‌రికి అర్ధమయ్యే రీతిలో మాట్లాడుతూ.. జనాలకు వినోదం అందిస్తుంటాడు. ఐతే అంటార్కిటికా యాత్ర కోసం మొద‌ట యూట్యూబ్ వేదిక‌గా ఫండ్‌ను క‌లెక్ట్ చేశాడు అన్వేష్. ఆ యాత్రకు ఎంత ఖర్చయింది? సబ్‌స్క్రైబర్స్ ఎన్ని డబ్బులు ఇచ్చారు? యూట్యూబ్ నుంచి ఎంత ఆదాయం వచ్చింది? అనే వివరాలను ఆధారాలతో సబ్‌స్క్రైబర్స్‌కి వివరించాడు. అంతేకాదు జనాలు ఇచ్చిన డ‌బ్బుల‌ను.. తిరిగి వాళ్ల‌కే ఇచ్చే ఒక చ‌క్క‌టి సంప్ర‌దాయ‌నికి తెర తీశాడు అన్వేష్.

తెలుగు ట్రావెలింగ్ కమ్యూనిటీలో ఎక్కువగా వివాదంలో ఉండే మరో యూట్యూబర్.. రవి తెలుగు ట్రావెలర్ (Ravi Telugu Traveller). ఈయ‌న త‌న‌ని తాను పీఆర్ చేసుకోడంలో మిగ‌త వాళ్ల కంటే బాగా స‌క్సెస్ అయ్యాడు. 186 దేశాలు తిరిగిన తొలి తెలుగు వాడిగా రవి చెప్పుకుంటాడు. ఐతే ఈయన 186 దేశాలు తిర‌గలేద‌ని తోటి యూట్యూబ‌ర్స్ ఆరోపిస్తున్నారు. వీడియోల్లో తాను వెళ్లే ప్రాంతాలు చూపించ‌డం కంటే... తన గ‌ర్వ‌ాన్ని చూపించుకోవ‌డానికి ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తాడన్న విమర్శలున్నాయి. ఇతను గతంలో ఓసారి పాకిస్తాన్ జిందాబాద్ అని పెట్ట‌డం, ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జ‌రుగుతున్న‌ప్పుడు పాకిస్తాన్‌కు స‌పోర్ట్ చేస్తూ ఫేస్ బుక్‌లో పోస్ట్‌లు పెట్ట‌డం వివాదంగా మారింది. ప్రస్తుతం పాకిస్తాన్‌లో తిరుగుతున్న ఈయన.. దాయాది దేశంలో యూట్యూబ్ వీడియోలు చేయగల సత్తా తనకే ఉందని చెబుతున్నాడు. ఐతే ఆయన అసలు భారతీయుడే కాదు.. అమెరికన్ పౌరసత్వంతో పాకిస్తాన్‌లో తిరుగుతున్నాడని తోటి యూట్యూబర్స్ ఆరోపిస్తున్నారు. కానీ వ్యూస్ కోసం భారతీయుడిగా, తెలుగోడిగా చెప్పకుంటాడని విమర్శిస్తున్నారు.

అమెరికాలో తెలుగు వీడియోలు చేస్తూ ..  తక్కువ సమయంలో బాగా పాపురల్ అయిన యూఎస్ఏ రాజా (USA Raja) కూడా ఇటీవల వివాదంలో చిక్కుకున్నారు. ఈ మధ్యే అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన రాజా.. ఏపీలో గెట్ టు గెదర్ ఏర్పాటు చేశారు. అక్కడ ఓ అభిమాని ఆయనకు వేంకటేశ్వరుడి స్వామి ఫొటోను బహూకరించడంతో.. ఆయన భార్య వెంటనే వచ్చి.. ఆ ఫొటోను పక్కనబెట్టేసింది. వారు క్రిస్టియన్స్ కావడం వల్లే.. వెంకటేశ్వరుడి స్వామి ఫొటోను తీసుకోలేదని విమర్శలు వచ్చాయి.  ఈ వ్యవహారంపై హిందూ సంఘాలకు చెందిన కొందరు వ్యక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

రైలు బోగీలు వేర్వేరు రంగుల్లో ఎందుకుంటాయో తెలుసా? కలర్ చూసి కోచ్‌ను గుర్తించండి ఇలా

ఇలాంటి వాళ్లను మీడియాతో పాటు MCN కంపెనీలు ఎక్కువగా ప్రమోట్ చేయడంతో... ఇదే రంగంలో ఎంతో కష్టపడుతూ.. మంచి కంటెంట్ ఇస్తున్న ఇతర యూట్యూబర్స్‌కి అన్యాయం జరుగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తానికి యూట్యూబ్ వేదికగా..  తెలుగు ట్రావెలింగ్ కమ్యూనిటీలో రచ్చ రచ్చ జరుగుతోంది. వీళ్లు తమ అభిరుచిని వ్యాపారంగా మార్చేసి.. పెద్ద సెలబ్రిటీల్లా ఫీలవుతున్నారని వీక్షకులు విసుక్కుంటున్నారు. అంతేకాదు లక్షల్లో డబ్బులు వస్తున్నా... సబ్‌స్క్రైబర్స్ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని.. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌లు వినిపిస్తున్నాయి.

First published:

Tags: Andhra Pradesh, Telangana, Travelling, Youtube

ఉత్తమ కథలు