ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో విద్యుత్ సంక్షోభం (AP Power Crisis) నడుస్తోంది. వేసవి కాలంలో కరెంట్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ను అందించాలంటే ఎపి ట్రాన్స్ కో పటిష్టంగా ఉండాలని ఆయన అన్నారు. సచివాలయంలోని విద్యుత్ ట్రాన్స్ కో అధికారులతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. డిస్కంలకు విద్యుత్ ను సరఫరా చేయడంలో ట్రాన్క్ కో సమర్థవంతమైన నెట్ వర్క్ తో పనిచేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్క్ కో ఆధ్వర్యంలో నూతన విద్యుత్ లైన్లు ఏర్పాటు, పంపిణీ వ్యవస్థలో భాగంగా సబ్ స్టేషన్ల నిర్మాణం, డెడికేటెడ్ కేబుల్స్, టవర్స్ నిర్మాణం పనులను వేగవంతం చేయాలని కోరారు.
రాష్ట్ర వ్యాప్తంగా 400 కెవి సామర్థ్యం కలిగిన 16 సబ్ స్టేషన్లు, 220 కెవి సామర్థ్యం ఉన్న 103 సబ్ స్టేషన్లు, 132 కెవి సామర్థ్యం ఉన్న 232 సబ్ స్టేషన్లు ఉన్నాయని, వాటి ద్వారా డిస్కం లకు విద్యుత్ సరఫరా జరుగుతోందని అన్నారు. మొత్తంగా 351 సబ్ స్టేషన్ల ద్వారా ట్రాన్క్ కో నుంచి డిస్కంలకు విద్యుత్ సరఫరా జరుగుతోందని తెలిపారు. వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ అందించేందుకు రూ.223.47 కోట్లతో పనులు జరుగుతున్నాయన్నారు.
గ్రీన్ ఎనర్జీ కారిడార్ కోసం రూ.941.12 కోట్లతో పనులు జరుగుతున్నాయని, విశాఖపట్నం-చెన్నై కారిడార్ లో రూ.605.56 కోట్ల మేర పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. మూడు జోన్లలో సిస్టమ్ ఇంప్రూవ్ మెంట్ లో భాగంగా రూ.762.53 కోట్ల పనులు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే 400 కేవీ సామర్థ్యంతో కూడిన విద్యుత్ సరఫరా కోసం రూ.1257.56 కోట్లతో పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రూ.3,897.42 కోట్లతో ట్రాన్స్ కో ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో ఆయా పనులకు సంబంధించి ప్రతిఏటా ఎస్ఎస్ఆర్ రేట్లపై రివిజన్ జరగాలని సూచించారు. ఇందుకోసం వెంటనే కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. అంతేకాకుండా ట్రాన్స్ కో చేపట్టిన పనులకు గాన అటవీశాఖ క్లియరెన్స్ కోసం పనుల్లో ఎటువంటి జాప్యం లేకుండా నోడల్ ఆఫీసర్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఇఎపి కింద చేపట్టిన ప్రాజెక్ట్ లను సకాలంలో పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేయాలని కోరారు. నిధుల లభ్యత, పనుల పురోగతిలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా వాటిని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్ళి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఓవర్ లోడింగ్, లో ఓల్టేజీ సమస్యలను పూర్తిస్థాయిలో నియంత్రించాలని, దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్, ట్రాన్స్ కో జెఎండి పృథ్వీతేజ్ పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Power cuts