కృష్ణాజిల్లా (Krishna District) గుడివాడ (Gudivada) సమీపంలో పెను ప్రమాదం తప్పింది. గుడివాడ-మానికొండ రోడ్డులో వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) పల్లెవెలుగు బస్సు షార్ట్ సర్క్యూట్ కారణందా దగ్ధమైంది. విజయవాడ నుంచి గుడివాడ (Vijayawada-Gudivada) వెళ్తున్న పల్లెవెలుగు పెద్దపారుపూడి మండలం వెంట్రప్రగడ చేరుకోగానే బస్సులో మంటలు చెలరేగాయి. ఘటన జరిగిన సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులున్నారు. వారిలో వివిధ పనులపై వెళ్లేవారు, విద్యార్థులున్నారు. బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులుంతా ఆందోళనకు గురయ్యారు. మంటల నుంచి తప్పించుకునే క్రమంలో పుస్తకాలు, బ్యాగులు కూడా వదిలేసి దూకేశారు. ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోయినా.. లగేజీ బ్యాగుల్లో ఉన్న నగదు, బంగారం ఉందని ప్రయాణికులు వాపోతున్నారు.
ఇటీవల పెద్దపారుపూడి వద్ద భీమవరం వెళ్తున్న బస్సు పంట కాలువలోకి దిగిపోయింది. స్థానికులు వెంటనే స్పందించి ప్రయాణికులను కాపాడటంతో పెనుప్రమాదం తప్పింది. ఆఘటన జరిగినప్పుడు బస్సులో 30 మంది ఉండగా.. అందరూ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.
ఇదిలా ఉంటే గుడివాడ-విజయవాడ రోడ్డులో నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కోమటిగుంట లాకులు, మానికొండ, నందమూరు, కలవపాముల, వెంట్రప్రగడ, పెదపారుపూడి, గుడివాడ మధ్యలో దాదాపు 25 కిలోమీటర్ల రోడ్డుపై 150కి పైగా గోతులున్నాయి. ఓ వైపు దోసపాడు కెనాల్, మరోవైపు పంట కాలువలతో రోడ్డంతా ప్రమాదకరంగా మారింది. రోడ్డు ఇరువైపులా కుంగిపోవడం, నెర్రిల్చిచడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.
రోడ్డును మరమ్మత్తులు చేయాలని స్థానిక గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ రోడ్డులో ఇప్పటివరకు వేలాది ప్రమాదాలు జరిగాయి.. వందలాది మంది గాయపడగా.. మృతులు సంఖ్య కూడా పదుల సంఖ్యలో ఉంది. దాదాపు 20ఏళ్లుగా ఈ రోడ్డుపై ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. బస్సులు, కార్లు, వ్యాన్లు, బైకులు కాలువల్లోకి దూసుకెళ్తున్నాయి. ఈ రోడ్డు సంగతి తెలియని వాళ్లు వెళ్తే మాత్రం ప్రాణాలమీదకు తెచ్చుకున్నట్లే అని స్థానికులు అంటుంటారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Apsrtc, Gudivada, Local News