Murali Krishna, News18, Kurnool
మనిషి బ్రతకాలంటే మానసికంగా ధృడంగా ఉండాలి. శారీరకంగా బలంగా ఉండాలి. అలాంటి శరీరంలో ఏదో లోపముందని బాధపడితే తీవ్రపరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఎదుటివారి మాటలకు మనస్తాపం చెందిన యువతి అకారణంగా ప్రాణాలుతీసుకుంది. పెళ్లిచూపులుకు వచ్చిన వాళ్లంతా తన రంగు, రూపు గురించి మాట్లాడి నిరాకరిస్తున్నారని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్నూలులో జరిగింది. గీతావీధికి చెందిన రోజా (25) ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. తండ్రి ప్రతాప్ ఇచ్చిన ఫిర్యాదులో తన కూతురుకు పెళ్లిచూపులు చూసేందుకు వచ్చిన వారు నలుపుగా, పొట్టిగా ఉందంటూ నిరాకరిస్తున్నారని, దీంతో మనస్తాపం చెంది ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు.
రోజా దొర్నిపాడు మండలం బుర్రారెడ్డిపల్లె గ్రామ సచివాలయంలో సర్వేయరుగా పని చేస్తున్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు ప్రాథమికంగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. మృతి చెందిన సమయంలో ఆమె రెండు చేతుల నిండా గాజులు ధరించి ఉండటం ఆశ్చర్యంగా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఆమె మృతికి సర్వేయర్ల సంఘం అధ్యక్షుడు రవిప్రకాశ్, ఉపేంద్ర సంతాపం తెలిపారు.
మూడేళ్ల చిన్నారిని కబళించిన మృత్యువు..!
రహదారి పక్కన బహిర్భూమి వెళ్లగా మూడేళ్ల చిన్నారి లారీ రూపంలో మృత్యువు కబళించిన ఘటన ఆదోని మండలం బైచిగేరి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బైచిగేరి గ్రామానికి చెందిన బి.రామకృష్ణ, మల్లేశ్వరి దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. చిన్న కుమారుడు శ్రీనివాసనాయుడు (3) ఉదయం ఇంటి సమీపంలో రహదారి పక్కన మరుగుదొడ్డికి వెళ్లగా..ఆదోని నుంచి సాంబగల్లు వైపు వెళ్తున్న ఐచర్ లారీ బాలుడిని ఢీకొంది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలుడిని చికిత్స కోసం ఆదోని ప్రాంతీయ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలుకు తరలిస్తుండగా.. ఎమ్మిగనూరు సమీపంలో మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. కుమారుడు తమ కళ్లేదుటే మృతి చెందడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారు.
పాఠశాల భవనం పై నుంచి జారి కింద పడిన విద్యార్థిని..!
బండి ఆత్మకూరు కేజీబీవీ పాఠశాల భవనంపై నుంచి ఓ విద్యార్థిని కింద పడింది. భవనంపైన ఆరేసుకున్న దుస్తులు తీసుకురావడానికి వెళ్లిన పార్నపల్లె గ్రామానికి చెందిన స్వప్న అనే టెన్త్ క్లాస్ విద్యార్థిని ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. గాయపడిన విద్యార్థినిని ఉపాధ్యాయులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. స్వప్నకు కాలు విరిగిందని గుర్తించడంతో అక్కడి నుంచి నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
వైద్య పరీక్షలు చేశాక ఎలాంటి ఇబ్బంది లేదని రిపోర్టులో తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విద్యార్థిని కాలికి కట్టుకట్టి వైద్య పరీక్షలు అందిస్తున్నారు. కాలుజారి కింద పడ్డానని స్వప్న ఇచ్చిన వివరణ మేరకు విచారణ చేపట్టినట్లు ఎస్ఐ బాబు తెలిపారు. స్వప్న కింద పడిన ఘటనపై కలెక్టర్ వైద్యులతో ఫోన్లో వాకబు చేశారు. దీంతో డీఈవో, డీసీడీవో, ఎంఈవో, ఎస్ఐ, మరికొంత మంది అధికారులు ఆస్పత్రికి చేరుకొని..ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News