Diamonds Searching: అక్కడి రైతులంతా.. తొలికరి వర్షాలు ఎప్పుడు ఎప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. రాయలసీమ జిల్లాలైన కర్నూలు (kurnool), అనంతపురం (Anantapuram) జిల్లాలలో ప్రజలు వజ్రాల కోసం వేట మొదలు పెడతారు. తమను అదృష్టలక్ష్మి వజ్రాల (Diamonds) రూపంలో తలుపు తట్టే అవకాశం ఉంటుందని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కర్నూలు, అనంతపురం జిల్లాలలో ఇప్పటికే ఈ వజ్రాల వేట మొదలైంది. వర్షాల సీజన్ మొదలవ్వగానే కర్నూలు జిల్లాలోని పొలాల్లో వజ్రాల వేట స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అదేపనిగా వజ్రాల వేట కొనసాగుతుంది.
తొలకరి వస్తే ఫ్యామిలీలన్నీ పొలాల్లోనే…! వర్షాలు పడటం మొదలవ్వగానే కొన్ని ప్రాంతాల్లో వజ్రాలు దొరుకుతాయని కొన్నేళ్లుగా వస్తున్న ప్రచారం. ప్రచారం మాత్రమే కాదు అడపాదడపా రైతులకు వజ్రాలు కూడా దొరుకుతుంటాయి. అలా ఎప్పుడో ఒకసారి దొరికే వజ్రాలే అయినా..తమకు ఒక్కటైనా దొరకకుపోతుందా అని ఫ్యామిలీ మెంబర్స్ అంతా వెళ్లి పొలాల్లో వెతుకుతుంటారు. ముఖ్యంగా కర్నూలు జిల్లాలోని మద్దికెర, పగిడిరాయి, ఎర్రగుడి, జొన్నగిరి, ప్రాంతాల్లోని ఎర్ర నేలల్లో వజ్రాల వేట ఎక్కువగా ఉంటుంది.
ఈ ఏడాది ఇద్దరికి దొరికిన వజ్రాలు..! ఈ క్రమంలో ఈ ఏడాది తొలకరి మొదలవ్వగానే ప్రజలు వజ్రాల వేట మొదలెట్టేశారు. మంగళవారం వజ్రాల వేటకు వెళ్లిన రైతుకు రెండు వజ్రాలు దొరికినట్టు సమాచారం. తుగ్గలి మండలంలోని గిరిగెట్లలో రైతులకు ఈ వజ్రాలు దొరికినట్టు తెలుస్తోంది. పొలంలో పనిచేస్తుంటే రైతులకు రెండు వజ్రాలు దొరికాయని, ఇందులో ఒక వజ్రాన్ని రూ 2.5 లక్షల నగదు, 2 తులాల బంగారానికి, మరో వజ్రాన్ని రూ. 15 వేలకు వజ్రాల వ్యాపారులు కొనుగోలు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించి అధికారికంగా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: వంటనూనె రెండో సారి వాడుతున్నారా..? బీకేర్ ఫుల్.. ఆ నూనెను ఏం చేయాలో తెలుసా..?
గతంలోనూ దొరికిన వజ్రాలు..! గతంలోనూ ఇక్కడి పొలాల్లో చాలామందికి వజ్రాలు దొరికాయి. ఇటీవల ఓ రైతుకు అక్షరాల కోటి రూపాయలు విలువ చేసే వజ్రం దొరికింది. గత మే నెల 17వ తేదీన చిన్నజొన్నగిరి ప్రాంతానికి చెందిన ఓ మహిళకు 30 క్యారెట్ల వజ్రం దొరికింది. ఆ మరుసటిరోజే మరో మహిళకూ వజ్రం లభించింది.
ఇదీ చదవండి: బాలయ్య నియోజకవర్గంపై అధినేత జగన్ ఫోకస్.. స్థానిక వైసీపీ నేతలే బ్రేక్ లు వేస్తున్నారా..?
ఇదిలా ఉంటే, రైతులకు కొన్ని రోజుల నిరీక్షణ తర్వాత దొరికిన వజ్రాలను స్థానిక వ్యాపారులు తక్కువ ధరకే కొట్టేస్తున్నారు. వాటిని వాళ్లు కోట్ల రూపాయలకు మార్కెట్లో అమ్ముకుంటూ రైతులను మోసం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అయినా కానీ, రైతులు బయటకు వెళ్లి ఎక్కడా మార్కెట్లో అమ్ముకోలేక తమ దగ్గరకే వస్తున్న వ్యాపారులకు ఎంతోకొంతకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.
రాయలసీమలో బంగారు నిక్షేపాలు ఉన్నట్లుగా గుర్తించింది. 2013లో బంగారం నిక్షేపాల వెలికితీతకు జియో మైసూర్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అనుమతి ఇచ్చింది. ఈ వజ్రాల వేట పేరుతో వ్యవసాయానికి ఇబ్బందులు తప్పడం లేదు. దుక్కి దున్ని విత్తనాలు విత్తుకోవాలి అని భావించే రైతులు, వజ్రాల కోసం జనాలు పొలాలలో చేస్తున్న అన్వేషణ లతో ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఏడు వజ్రాల కోసం జరుగుతున్న వేట వ్యవసాయం చేయాలనుకుంటున్న రైతులను ఇబ్బందులకు గురి చేస్తోంది. మరి ఈ సారి ఇప్పటికే ఇద్దరిని లక్ష్మీ దేవి వరించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, AP News, Heavy Rains, Kurnool