Murali Krishna, News18, Kurnool
ఇటీవల ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పులుల భయం పెరిగిపోయింది. అడవి నుంచి వస్తున్న పులులు (Tigers) గ్రామాల్లో సంచరిస్తుండటంతో జనం హడలిపోతున్నారు. ఇప్పటికే కాకినాడ జిల్లా (Kakinada District) లో పెద్దపులి స్థానికులను నిద్రపోనివ్వడం లేదు. ఇటు నల్లమల అడవి శివార్లలోనూ అదే పరిస్థితి. ఉమ్మడి కర్నూలు జిల్లా (Kurnool District) నల్లమల అడవి ప్రాంతం సమీపంలోని గ్రామాల్లో నివసించే ప్రజలకు పెద్ద పులుల సంచారం కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. తాజాగా నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురం గ్రామ సమీపంలోని నాలుగు పెద్దపులి పిల్లలు కలకలం రేపాయి. వెంటనే గ్రామస్తులు ఆ నాలుగు పెద్ద పులి పిల్లలను కుక్కలు దాడి చేసి గాయపరచకుండా గ్రామంలోని ఓ గదిలో భద్రపరిచి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
లభ్యమైన పెద్ద పులి పిల్లల లభ్యం ఘటనపై అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. నాలుగు పెద్ద పులి పిల్లలను గ్రామంలో లభ్యమైన ప్రాంతంలోనే సమీప అటవీ ప్రాంతంలో వైద్య పరీక్షల అనంతరం విడుదల చేసినట్లు ఆత్మకూరు టైగర్ ప్రాజెక్ట్ డిప్యూటీ డైరెక్టర్ అలెన్ చాంగ్ టేరాన్ పేర్కొన్నారు. తల్లి పులి కూడా ఇక్కడే సంచరిస్తూ ఉంటుందని పిల్లలను తల్లి దగ్గరికి చేర్చే వరకు నిఘా ఉంచుతామని ఆయన అన్నారు.
అయితే పెద్ద పులి పిల్లల్లో రెండు పిల్లలు చాలా బలహీనంగా ఉన్నాయని గ్రామస్థులు పేర్కొన్నారు. అటవీ ప్రాంతంలో విడుదల చేస్తే అవి చనిపోయే ప్రమాదం ఉందని తల్లి పులి ఇంతకీ బ్రతికే ఉందో లేదో అని గ్రామస్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇలా నల్లమల్ల అడవి ప్రాంతం సమీపంలో నివసించే గ్రామాల్లో తరచూ పులులు ఎలుగుబంట్లు అడవి మృగాలు గ్రామాల్లో సంచరిస్తూ ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ విధంగా పులులు జంతువులు గ్రామాల్లో సంచరిస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గ్రామంలో ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఏ జంతువు వచ్చి దాడి చేసి గాయపరుస్తుందో నన్న భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించాల్సిన పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు వాపోతున్నారు.
ముఖ్యంగా పిల్లలు ఇంటి నుంచి బయటికి వెళ్లినా పాఠశాలలకు వెళ్లిన తిరిగి ఇంటికి క్షేమంగా వస్తారో లేదో నాన్న భయంతో బ్రతకాల్సిన పరిస్థితి ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం చేస్తే రైతులు సైతం తమ పొలాలకు వెళ్లి పనులు చేసుకోవాలన్నా భయపడుతూ పొలాలకు వెళ్లి పనులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు. అడవి జంతువుల నుంచి తమకు రక్షణ కల్పించాలని.. జంతువులను అడవిలోకి వెళ్లే విధంగా చర్యలు చేపట్టాలని వెంటనే ఫారెస్ట్ అధికారులు స్పందించి ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా భద్రత ఏర్పాట్లను చేయాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News, Nallamala forest, Tigers