Murali Krishna, News18, Kurnool
కర్నూలు (Kurnool) ప్రభుత్వాసుపత్రిలోని డిఎంహెచ్ఓ కార్యాలయం ఆవరణలో మహిళలకు మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ గా శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని 1973లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఎంపీహెచ్ డబ్ల్యుఓ (MPHWO) పేరిట రెండు సంవత్సరాల శిక్షణ కోర్సును ఇస్తున్నారు. ఈ కోర్సులో సుమారు 30 మంది విద్యార్థులు ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నారు. అలాగే ఐపిపి స్కీం కింద 17 మంది, ఎల్ హెచ్ బి స్కీం కింద 17 మంది, ఎంపిహెచ్ డబ్ల్యు స్కీం కింద 20 మంది... మెుత్తం 54 మంది విధులు నిర్వహిస్తున్నారు. వీరికి నెలకు వేతనాల రూపంలో 40 లక్షల చొప్పున ఏడాదికి 4.8 కోట్లు రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.
అయితే ఇక్కడ విద్యార్థినులకు ఎంపీహెచ్ డబ్ల్యుఓ శిక్షణ మాత్రమే సవ్యంగా సాగుతోంది. మిగతా శిక్షణ కార్యక్రమాలు తూతూ మంత్రంగానే సాగుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలోని డిఎంహెచ్ఓ కార్యాలయం ప్రారంభంలో ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో దాదాపుగా 30 మంది విద్యార్థులు మల్టీపర్పస్ హెల్త్ వర్కర్లుగా శిక్షణ తీసుకుంటున్నారు. అయితే ఈ కోర్సు కు ప్రిన్సిపల్ కం వార్డెన్ గా వ్యవహరిస్తున్న విజయ సుశీల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నట్లు విద్యార్థినుల ఆరోపిస్తున్నారు.
వింత వింత రూల్స్..!
కాలేజీకి వచ్చే అమ్మాయిలు బొట్టు పెట్టుకోకూడదు, గోరింటాకు పెట్టుకోకూడదంటూ విజయ సుశీల అడ్డగోలు నిబంధనలు విధిస్తున్నారు. రూల్స్ బ్రేక్ చేసిన వారికి జరిమానా వేస్తున్నారని విద్యార్థినులంటున్నారు. అలాగే ఇంట్లో పనిచేసేందుకు, వ్యక్తిగత సేవలు చేసేందుకు రావాలని.. అలా చేయని వారికి మార్కులు వేసేది లేదని బెదిరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆమె వేధింపులు భరించలేక ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడ్డారట. విషయం పెద్దది కావడంతో స్పందించిన ఉన్నతాధికారులు ఆమెను సస్పెండ్ చేశారు.
ఐతే ప్రిన్సిపాల్ విజయ సుశీల ఆగడాలు అన్నీ ఇన్నీ కావని.. ఇద్దరు విద్యార్థినుల చావుకు ఆమే కారణమని తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఆమెపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News