Murali Krishna, News18, Kurnool
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) హైకోర్టును (High Court) వెంటనే అమరావతి (Amaravathi) నుంచి తరలించి కర్నూలు (Kurnool) లో ఏర్పాటు చేయాలని న్యామవాదులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం రాజ్యాంగ హక్కు అని న్యాయవాదులు ముక్తకంఠంతో వాదిస్తున్నారు. అందులో భాగంగానే గురువారం కర్నూలు జిల్లా కోర్టులో న్యాయవాదులు విధులకు బహిష్కరణ చేసి నిరసన వ్యక్తం చేశారు. కర్నూలు పాతబస్టాండ్లోని జిల్లా కోర్టు నుంచి రాజవిహార్ మీదగా కర్నూలు కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇన్నేళ్లుగా కర్నూలుకు జరిగిన అన్యాయాన్ని కొంత వరకైనా తగ్గించాలంటే హైకోర్టును ఏర్పాటు చేయాల్సిందే అంటూ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హైకోర్టు ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నారని.. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం అమరావతి పేరుతో రాజకీయం చేస్తున్నారని బార్ అసోసియేషన్ మెంబర్లు మండిపడ్డారు. హైకోర్టు తరలింపును అడ్డుకునే ఏ పార్టీకైనా వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతామని.. లాయర్ల సత్తా ఏంటో తెలియజేస్తా మంటూ హెచ్చరించారు.
హైకోర్టు తరలింపు కోసం వెంటనే తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని న్యాయవాదులు కోరారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే వరకు తమ విధులను బహిష్కరించి..ఆందోళన చేస్తామంటూ బార్ అసోసియేషన్ మెంబర్లు హెచ్చరించారు.
ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ 1954 లోని శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలుకు న్యాయం చేయాల్సిందేనని న్యాయవాదులు డిమాండ్ చేశారు. 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా ఎంతో చరిత్ర ఉన్న కర్నూలును రాజధాని చేయకుండా అమరావతిలో రాజధాని నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే రాజధాని కోల్పోయి కర్నూలు చాలా అన్యాయానికి గురైందని అన్నారు. కర్నూలు జిల్లా పూర్తిగా కరువు జిల్లాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని,అలాంటి జిల్లాలో ఎలాంటి పరిశ్రమలు,నిధులు రాక, నీళ్లు లేక రైతాంగం, కర్షక రంగం ఇబ్బందుల్లో ఉందన్నారు. అలాంటి జిల్లా కేంద్రంలో హైకోర్టు ఏర్పాటు చేస్తే కొంతైనా న్యాయం జరుగుతుందని న్యాయవాదులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయని పక్షంలో సుదీర్ఘకాల ఆందోళనలకు సిద్ధమవుతామని న్యాయవాదులు హెచ్చరించారు. అవసరమైతే ప్రాణత్యాగానికైనా వెనుకాడబొమన్నారు. రాజధానికి సంబంధం లేకుండా శ్రీ బాగ్ ఒడంబడిక ప్రకారం హైకోర్టును కర్నూలు నగరంలో ఏర్పాటు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు.
రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు నగరానికి చరిత్ర లేకుండా చేస్తున్నారని అధికార, ప్రతిపక్ష పార్టీలపై న్యాయవాదులు దుమ్మెత్తి పోశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు పి.రవిగువేరా, సీనియర్ న్యాయవాదులు ఓంకార్, పి.సువర్ణరెడ్డి, వి.నాగలక్ష్మీ,, ఎం.సుబ్బయ్య, బి,చంద్రుడు, కర్నాటి పుల్లారెడ్డి జయరాజు,పాలూరి రవి గువ్వెర, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP High Court, Kurnool, Local News