Murali Krishna, News18, Kurnool
కర్నూలు (Kurnool) నగరంలోని స్థానిక 32వ వార్డ్, ముజఫర్ నగర్ లో గల సీపీఎం (CPM) కార్యాలయం అగ్నికి ఆహుతి అవడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. గత 30 సంవత్సరాలుగా వార్డు ప్రజల సమస్యల పరిష్కారానికి, ఉద్యమ నిర్మాణానికి కేంద్రంగా వున్న సీపీఎం కార్యాలయం గత సోమవారం అర్ధరాత్రి 11.00 గంటల సమయంలో అగ్నికి ఆహుతి అయ్యింది. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఎవరైనా స్వార్థపరులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారా అనేది మిస్టరీగా మారింది. దింటిపై పోలీసులు విచారణ జరపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి. గౌస్ దేశాయ్ కోరారు. ఈ మేరకు సిపిఎం జిల్లా కార్యదర్శి డి. గౌస్ దేశాయ్, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పియస్ రాధాకృష్ణ, పి నిర్మల, మరియు ఇతర సిపిఎం నేతలు ఘటన స్థలాన్ని పరిశీలించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వార్డులోని ముజఫర్ నగర్ కేంద్రంగా పార్టీ కార్యాలయం నుండి అనేక పోరాటాలు నిర్వహించి స్థానికంగా అభివృద్ధికి కృషి చేయడం జరిగిందన్నారు. ఇటువంటి కార్యాలయం అర్ధరాత్రి సమయంలో మంటల్లో కాలి బూడిదవడం బాధాకరమని ఆవేదన చెందారు. ఈ మధ్యకాలంలో అరాచక శక్తులు కాలని ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే విదంగా రోడ్లపై మద్యం సేవిస్తూ ప్రశ్నించిన వారిపై దాడి చేసే ప్రయత్నం జరుగుతుందని సిపిఎం నేతలు అన్నారు. ఈ విషయంలో అనేక సార్లు పోలీసులకు పిర్యాదు చేసినా ఫలితం శూన్యం అన్నారు.
నేడు పార్టీ కార్యాలయంపై దీపావళి సాకుతో ఈ దుర్గటనకు పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేశారు. కార్యాలయంలో అకస్మాత్తుగా మంటలు రావడం గమనించి ముజఫర్ నగర్ మహిళలు, యువకులు, సిపిఎం కార్యకర్తలు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారని గౌస్ దేశాయ్ వివరించారు. ఈ ఘటనపై నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ పి.శంకరయ్యకు ఫిర్యాదు చేశామని సిపిఎం నేత గౌస్ దేశాయ్ తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ చేసి ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.అయితే ఈ ఘటనకు సంబంధించి అనుమానితులు పేర్లు బయటకు రాలేదు. దీంతో ఇది ఆకతాయిల పనా? లేక ప్రమాదమా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, CPM, Kurnool, Local News