Murali Krishna, News18, Kurnool
అడగనిదే అమ్మ అయినా అన్నం పెట్టదంటారు. అలాంటిది ఆహారం కావాలని నోరు తెరచి అడగలేని మూగ జీవాలకు ఆహారం అందిస్తున్నాడు ఓ రైతు. అదేదో మార్కెట్ నుంచి కొని తెచ్చిన ఆహారాన్ని అందిస్తున్నాడని అనుకునేరు. రైతు స్వయంగా తన సొంత పొలంలో పక్షుల కోసం పంట పండిస్తున్నాడు. తనకున్న అరెకరం సొంత పొలంలో పక్షుల కోసం ప్రత్యేకంగా పంటను సాగు చేస్తూ వాటి ఆకలి తీరుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఆ రైతు. అంతే కాదు పక్షుల కోసం పంట వేసి వదిలేయకుండా వాటి కోసం నీళ్ల తొట్టెలను ఏర్పాటు చేసాడు. కర్నూలు జిల్లా (Kurnool District) ఎమ్మిగనూరు మండలం గుడికల్ గ్రామానికి చెందిన దేవదాసు పక్షి ప్రేమికుడు.
అంతరించిపోతున్న పక్షులను సంరక్షించాలన్న ఉద్దేశంతో దేవదాసు తన వంతు సహకారం అందిస్తున్నాడు. గుడికల్ గ్రామంలో రైతులు పత్తి, వరి పంటనే సాగు చేస్తుండడంతో పక్షులకు గింజలు దొరకడం కష్టంగా మారింది. దీంతో దేవదాసు తనకున్న అర ఎకరా పొలంలో పక్షుల కోసం ప్రత్యేకంగా సజ్జ పంటను సాగు చేస్తున్నాడు. మనిషికి మనిషి సహాయ పడని ఈ రోజుల్లో కూడా మూగ జీవాల సంరక్షణకు పాటు పడుతున్నాడు పక్షి ప్రేమికుడు దేవదాసు. పక్షుల గురించి అలోచించి దేవదాసు చేస్తున్న ఈ పనిని అందరు అభినందిస్తున్నారు.
ఉదయం సూర్యాస్తమయం సమయంలో పక్షులు ఇక్కడికి చేరి సేద తీరుతున్నాయి. సాయంకాలం పక్షులు తమ కిలకిలరావాలతో చేసే సందడిని చూసేందుకు చుట్టుప్రక్కల పక్షి ప్రేమికులు అక్కడికి వచ్చి పచ్చని పొలాల నడుమ గడపడం ఎంతో ఆహ్లాదాన్ని పంచుతాయని అంటున్నారు అక్కడి జనం.
అంతేకాదు మనిషి హాయిగా బ్రతకాలన్నా, ప్రకృతిని సమతౌల్యంగా ఉంచాలన్నా పక్షులు చాలా కీలకం. అయితే పెరుగుతున్న టెక్నాలజీ రేడియేషన్ వలన పక్షులు కనుమరుగవుతున్నాయి. రేడియేషన్ పవర్తో పక్షులు మృత్యువాత పడుతుండగా, ఉన్న కొన్ని పక్షులు సరైన ఆహారం లేక మృత్యువాతపడుతున్నాయి. పక్షుల సంరక్షణార్థం కొందరు పక్షి ప్రేమికులు అక్కడ అక్కడ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. గుడికల్ గ్రామ రైతు దేవదాసు సైతం పక్షుల సంరక్షణ నిమిత్తం తన వంతు సహకారాలు అందిస్తున్నాడు. అయితే ఇలా ఏకంగా పక్షుల కోసం ఆహారపు గింజలు పండించడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Birds, Kurnool, Local News