Murali Krishna, News18, Kurnool
ఆయన రాష్ట్ర మంత్రి. కేబినెట్ లో ఉన్నారా లేరా అనేట్టుగా ఉంటుంది ఆయన పాత్ర. మంత్రిగా కంటే వివాదాలతోనే ఆయన ఫేమస్. సొంత నియోజకవర్గంలోనూ అంతే.. జనం ఆయన్ను నిలదీయడమో లేక ఆయనే వివాదాల చుట్టూ తిరగడమో జరుగుతుంటుంది. ఆయనే ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం. మంత్రి అయినా కూడా తన సొంత నియోజకవర్గమైన ఆలూరు ప్రాంతంలో వరుసగా చేదు అనుభవాలను చవి చూస్తున్నారు గుమ్మనూరు జయరాం. గడపగడపకు మన ప్రభుత్వం నవరత్నాలు పేరుతో గ్రామాల్లోకి వెళ్లిన గుమ్మనూరు జయరామను ప్రజలు నిలదీశారు. మంత్రి అయ్యుండి కూడా కనీసం నియోజకవర్గంలో సరైన రోడ్లు, కాలువలు, కుళాయిలు వేయించలేదంటూ ప్రజలు నిలదీశారు.
కొన్నాళ్లుగా ఆయన నియోజకవర్గ పర్యటనలు సవ్యంగానే సాగుతుండగా.. మరో వివాదం గుమ్మనూరు గుమ్మం తొక్కింది. జయరాంకు ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీచేయడం జిల్లాలోని చర్చనీయాంశమైంది. ఆయన భార్య పెంచలపాడు రేణుకమ్మతో పాటు ఆలూరు సబ్రిజిస్ట్రార్ కూ అక్టోబరు 31న ఐటీ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఈ విషయం లేటుగా బయటకు వచ్చినా లేటెస్ట్ న్యూస్ అదే అవుతోంది. మంత్రి జయరాం సతీమణి రేణుకమ్మకు ఎలాంటి ఆదాయ ఆస్తులు లేకపోయినా ఆమె పేరిట 30 ఎకరాల భూమిని దాదాపు రూ.52.40 లక్షల రూపాయలతో కొనుగోలు చేయడానికి డబ్బు ఎలా వచ్చిందో 90 రోజుల్లో సమాధానమివ్వాలని ఆ లేఖలో పేర్కొంది.
ఇట్టినా మంజునాథ నుంచి ఈ భూమి కొన్నాను' అని మంత్రి జయరాం గతంలో ఎలక్ట్రానిక్ మీడియాతో చెప్పినట్లు ఆధారాలు ఉన్నాయని. ఈ లావాదేవీలో ఆయనే తొలి లబ్ధిదారు అని నిర్ధారించుకున్నాకే ఈ నోటీసు ఇస్తున్నట్లు ఐటీ ప్రస్తావించింది. కర్నూలు జిల్లా ఆస్పరి మండల పరిధిలో 674/E, 729, 666/2, 668/C, 669/C, 713/A సర్వే నంబర్లలోని 30.83 ఎకరాల భూమి.2020 మార్చి 2న మంత్రి గుమ్మనూరు జయరాం భార్య రేణుకమ్మ పేరుతో రిజిస్ట్రేషన్ అయ్యింది.
ఇదీ చదవండి : యమలోకానికి షార్ట్ కట్స్ ఇవే..! డేంజర్ అని తెలిసినా.. అధికారులకు పట్దదా..?
అదే రోజు ఇతర కుటుంబసభ్యులు, బంధువుల పేరుతోనూ సుమారు 180 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. వీటిని ఎలా కొన్నారు అన్నదానిపై రేణుకమ్మ ఎలాంటి ఆదాయ వనరులు చూపించకపోగా.52.42 లక్షలతో ఎలా కొనుగోలు చేశారన్నది ఐటీ శాఖ అభియోగం.
ఈ భూములను మంత్రి జయరాం కొని, తన భార్యతోపాటు ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించారని గుర్తించిన ఐటీ అధికారులు.. ప్రొహిబిషన్ ఆఫ్ బినామీ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ చట్టం ప్రకారం నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. నోటీసులకు 90 రోజుల్లో సమాధానం చెప్పాలని..అప్పటి వరకు స్పందించకుంటే ఆ ఆస్తిని మూడో వ్యక్తికి బదలాయించకుండా జప్తు చేసే అధికారం ఉంది అని నోటీసుల్లో పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News