ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ఇసుక అక్రమ రవాణా వ్యవహారం దుమారం రేపుతోంది. ఇసుక అక్రమ రవాణాలో అధికార వైఎస్ఆర్సీపీ (YSR Congress) ప్రజాప్రతినిధిలకు హస్తముందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏకంగా ఓ మంత్రి ఇసుక అక్రమ రవాణాను ప్రోత్సహించారన్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం (Minister Gummanur Jayaram) అక్రమ ఇసుక రవాణా (Illegal Scam) వివాదంలో చిక్కుకున్నారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను వదిలేయాలని ఓ ఎస్సైని బెదిరించారన్న ఫోన్ కాల్ ఆడియో రికార్డ్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. వైసీపీ నేతల ఇసుక అక్రమ రవాణా నిజమేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
కర్నూలు జిల్లా (Kurnool Districti) ఆలూరు నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లను స్థానిక పోలీసులు పట్టుకొని సీజ్ చేశారు. ఈ వ్యవహారంలో రవాణా చేస్తున్న వ్యక్తులు మంత్రి జయరాంను ఆశ్రయించగా ఎస్సైకి ఫోన్ చేసిన జయరాం పట్టుకున్న ట్రాక్టర్లను వదిలేయాలని ఎస్సైకి హుకుం జారీ చేశారు. ఇల్లీగల్ గా వద్దు లీగల్ గా ఇసుక రవాణా చేసుకోవాలన్న ఎస్సైపై సీరియస్ అయ్యారు. పట్టుకున్న ట్రాక్టర్లను వదలకుంటే తానే ధర్నాకు దిగుతానని హెచ్చరించారు. “నాకు జనాలు కావాలి.. సేఫ్టీ కావాలి.. మరోసారి నేనే పోటీ చేసేదు.. నేను గెలిస్తేనే ఈడ యవ్వారం అయ్యేదు.. నేనే ధర్నాకు దిగాలా..” అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు.
ఆడియో లీక్ కావడంతో మంత్రి జయరాం కనుసన్నల్లోనే ఆలూరు నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందన్న ఆరోపణలకు బలం చేకూరినట్లైంది. ఓ వైపు ప్రభుత్వం పారదర్శకంగా ఇసుకను సరఫరా చేస్తున్నామని చెప్తుంటే మంత్రే అక్రమ రవాణా విషయంలో పోలీసులను బెదిరించడంపై విమర్శలు వస్తున్నాయి. ఐతే ఈ వ్యవహారంపై మంత్రి జయరాం స్పందించారు. తన నియోజకవర్గంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇసుక రీచ్ లు లేవని.. అలాంటప్పుడు ఇసుక అక్రమ రవాణా ఎలా జరుగుతందని ఆయన ప్రశ్నించారు. ఇదంతా అసత్య ప్రచారమేనని కొట్టిపారేశారు.
మంత్రి జయరాంపై ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఈఎస్ఐ స్కామ్ వెలుగుచూసిన సమయంలో మంత్రి తనయుడికి కొందరు బెంజ్ కారు కొనిచ్చారంటూ టీడీపీ నేతలు ఆరోపించారు. ప్రభుత్వ కాంట్రాక్టులు, టెండర్లకు సంబంధించిన వ్యవహారంలో ఆయన లంచాలు తీసుకున్నారని విమర్శించారు. అప్పట్లో బెంజ్ కార్ ఆరోపణలు రాజకీయాల్లో సంచలనమయ్యాయి.
ఇదిలా ఉంటే ఇటీవల విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ (Minister Adimulapu Suresh) దంపతులపై అక్రమాస్తుల కేసు నమోదు చేయాలంటూ సుప్రీం కోర్టు సీబీఐని ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రాథమిక దర్యాప్తును స్పష్టంగా పూర్తి చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సూచించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ మంత్రిపై కేసు నమోదుకు ఆదేశించారు. అంతకుముందు మంత్రి అవంతి శ్రీనివాస్ (Minister Avanthi Srinivas) ఓ మహిళతో మాట్లాడుతున్న కాల్ రికార్డ్స్ వైరల్ అయ్యాయి. నెల రోజుల వ్యవధిలో ఏకంగా ముగ్గురు మంత్రులు మంత్రులు వివాదాల్లో చిక్కుకోవడంతో అధికార పార్టీ చిక్కుల్లో పడింది. త్వరలో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉండే అవకాశముండటంతో మంత్రుల్లో ఆందోళన నెలకొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Sand mafia