రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల పరిశీలనను కృష్ణా నది యాజమాన్యబోర్డు (KRMB) వాయిదా వేసుకుంది. జాతీయ హరిత ట్రిబ్యునల్ (NGT) ఆదేశాల నేపథ్యంలో పర్యటన వాయిదా పడిందని అధికారులు వెల్లడించారు. పోతిరెడ్డిపాడు వద్ద ఎత్తిపోతల పథకం పరిశీలన తేదీని త్వరలోనే వెల్లడిస్తామని కేఆర్ఎంబీ తెలిపింది. ఏపీ ప్రభుత్వం అనుమతులు లేకున్నా.. రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టిందని ఎన్జీటీలో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. దానిపై విచారించిన ఎన్జీటీ.. ప్రాజెక్టు పనులను పరిశీలించి పూర్తి నివేదిక ఇవ్వాలని కేఆర్ఎంబీని ఆదేశించింది. ఎన్జీటీ ఆదేశాలతో గతంలోనే ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లాలని కేఆర్ఎంబీ భావించింది. ఏపీ ప్రభుత్వానికి కూడా సమాచారం ఇచ్చారు. ఐతే కరోనా విజృంభిస్తున్న సమయంలో పనుల పరిశీలన వద్దని ఏపీ చెప్పింది. అంతేకాదు కేఆర్ఎంబీలో తెలంగాణ అధికారులెవరూ ఉండకూడదని స్పష్టం చేసింది. అనంతరం ఆగస్టు 5న ప్రాజెక్టును పర్యటించాలని కేఆర్ఎంబీ భావించింది. కానీ సాంకేతిక కారణాలతో ఎన్జీటీ ఆదేశాల మేరకు మళ్లీ వాయిదా వేసుకున్నారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఇప్పటికే ఫిర్యాదు చేసింది. అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపడుతున్నారని.. తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) నిబంధనలకు విరుద్ధంగా అక్కడ పనులు జరుతున్నాయని ఫొటోలును కూడా సమర్పించారు. ఇటీవల మరోసారి తెలంగాణ నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ మంగళవారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్కు లేఖరాశారు. ఎన్టీజీ ఆదేశాలను అమలు చేయడంలో బోర్డు విఫలమయిందని వాపోయారు. తక్షణం రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఆగస్టు 3న కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ ప్రతినిధులు హాజరవగా తెలంగాణ ప్రతినిధులు డుమ్మా కొట్టారు. ఇక
కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్పై చర్చించేందుకు హైదరాబాద్ జలసౌధలో ఈనెల 9న గోదావరి నది యాజమాన్యబోర్డు (GRMB) అత్యవసరంగా సమావేశం కానుంది. ఈ మేరకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు జీఆర్ఎంబీ కార్యదర్శి సమాచారం ఇచ్చారు.
కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులన్నీ ఆయా బోర్డుల ఆధీనంలోకి వెళ్లనున్నట్లు ఇటీవల కేంద్రం ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ఇకపై అన్ని ప్రాజెక్టు నిర్వహణకు బోర్డులే చూసుకుంటాయని.. రాష్ట్రాలు జోక్యం చేసుకోకూడదని తెలిపింది. కృష్ణా నదిపై ఉన్న 36 ప్రాజెక్టులు కృష్ణా నది యాజమాన్య బోర్డు (KRMB), గోదావరిపై ఉన్న 71 ప్రాజెక్టులు గోదావరి నది యాజమాన్య బోర్డు (GRMB) పరిధిలోకి వెళ్తాయి. ప్రాజెక్టుల భద్రత కూడా సీఐఎస్ఎఫ్ చూసుకుంటుంది. అక్టోబరు 14 నుంచి ఈ నోటిఫికేషన్ అమల్లోకి వస్తుంది. ఒక్కో రాష్ట్రం ఒక్కో బోర్డుకు సీడ్ మనీ కింద రూ. 200 కోట్ల చొప్పున 60 రోజుల్లో డిపాజిట్ చేయాలి. నిర్వహణ ఖర్చుల్ని అడిగిన 15 రోజుల్లోపు చెల్లించాలి. అనుమతిలేని ప్రాజెక్టులకు నోటిఫికేషన్ అమల్లోకి వచ్చిన తర్వాత 6 నెలల్లోపు అనుమతులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అనుమతులు రాకుంటే ఆ ప్రాజెక్టులను నిలిపివేయాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.