తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం బుధవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. సమావేశం అనంతరం టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. తిరుమలకు ఎంతో భక్తిభావంతో భక్తులు వస్తున్నారని, ఆధ్యాత్మికభావన మరింత పెంచేలా తిరుమల తరహాలో తిరుపతిలోనూ దశలవారీగా మద్యపాన నిషేధం అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు సంక్రాంతి తర్వాత తిరుమలలో కూడా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని నిర్ణయించారు. స్వామివారి లడ్డూ ప్రసాదం తీసుకెళ్లేందుకు ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టనున్నారు.
- తిరుపతిలో గరుడ వారధిని రీడిజైన్ చేసి రీటెండర్లు పిలవాలని నిర్ణయం. తిరుపతిలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు నగర శివార్ల నుండే ఈ వారధి ప్రారంభమయ్యేలా డిజైన్లో మార్పు చేసేందుకు ఆమోదం.
- నిమ్స్ తరహాలో అభివృద్ధి చేసి మరింత మెరుగైన వైద్యసేవలందించేందుకు వీలుగా తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిని టీటీడీ ఆధీనంలోకి తీసుకునేందుకు ఆమోదం.
- టీటీడీ అటవీ విభాగంలో పనిచేస్తున్న 162 మంది సిబ్బందిని రెగ్యులర్ చేయాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు. మిగిలిన 200 మందికి మినిమమ్ టైంస్కేల్ వర్తింపచేస్తూ నిర్ణయం.
- టీటీడీ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న 382 మంది కాంట్రాక్టు టీచర్లు, లెక్చరర్లకు, కల్యాణకట్టలోని 246 మంది పీస్రేట్ క్షురకులకు మినిమమ్ టైంస్కేల్ వర్తింపు.
- టీటీడీ శాశ్వత ఉద్యోగులకు రూ.14 వేలు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు రూ.6,850/- బ్రహ్మోత్సవ బహుమానం అందించేందుకు నిర్ణయం.
- తిరుపతిలోని అలిపిరి వద్ద 200 పైచిలుకు ఎకరాల విస్తీర్ణంలో శ్రీవారి భక్తిధామం నిర్మించేందుకు నిర్ణయం. ఇక్కడ భక్తి ప్రవచనాలు, పిల్లల్లో భక్తిభావాన్ని పెంచేలా గ్రాఫిక్స్ ప్రదర్శనలు, ధ్యానం, యోగా కేంద్రాలు, శ్రీవారి వైభవాన్ని తెలిపేలా లేజర్ షో తదితరాలు ఏర్పాటు.
- తిరుమలకు నీటి సమస్యను అరికట్టేందుకు బాలాజి రిజర్వాయర్ నిర్మాణానికి అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపాలని నిర్ణయం.
- టీటీడీలో పదవీ విరమణ పొందిన అర్చకుల సేవలను తిరిగి ఏ విధంగా వినియోగించుకోవాలనే విషయంపై విధి విధానాలు రూపొందించేందుకు ఒక కమిటీ ఏర్పాటు.
- మతమార్పిడులను అరికట్టేందుకు ఎస్సి, ఎస్టి, బిసి ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు శ్రీవాణి ట్రస్టు ద్వారా విరాళాలు సేకరించేందుకు నిర్ణయం.
ఈ లారీలో 39 మృతదేహాలు బయటపడ్డాయ్...
Published by:Ashok Kumar Bonepalli
First published:October 23, 2019, 20:08 IST