Viveka Murder Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన దివంగత మంత్రి వివేకానంద రెడ్డి (Vivekanada Reddy) హత్య కేసు (Murder Case) లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి విచారణ కోసం వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) కి సీబీఐ నోటీసులు పంపించింది. దీనిపై ఆయన స్పందించారు. ఈ కేసు విషయంలో దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని.. ఇప్పుడు విచారణకు హాజరుకాలేనని సీబీఐకు లేఖ రాశారు. ఈ రోజు పులివెందులలో బిజీ షెడ్యూల్ ఉన్నందున విచారణకు రాలేనని ఆ లేఖలో పేర్కొన్నారు. ఒక రోజు ముందుగా నోటీసు పంపారు ముందుగా అనేక కార్యక్రమాలను అరేంజ్ చేసుకున్నాను. 5 రోజుల తర్వాత సీబీఐ ఎప్పుడు పిలిచినా హాజరవుతాను అంటూ లేఖలో పేర్కొన్నారు. అలాగే మరోసారి విచారణ తేదీ తెలియజేయాలని లేఖలో ఆయన కోరారు.
వివేకా హత్య కేసు విచారణలో భాగంగా సీబీఐ అధికారులు సోమవారం కడప , పులివెందులకు వెళ్లి పలువురిని విచారించారు. అలాగే పులివెందుల వైసీపీ కార్యాలయానికి వెళ్లిన అధికారులు అక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి కార్యాలయంతో పాటు తండ్రి భాస్కర్ ఇంట్లో సోదాలు జరిపారు. ఎంపీ తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి గురించి ఆరా తీశారు. భాస్కర్రెడ్డి కార్యాలయానికి రాలేదని పార్టీ కార్యకర్తలు చెప్పడంతో వారు వెనుదిరిగారు.
ఆ తరువాత పార్టీ కార్యాలయం సమీపంలోనే ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంటి పరిసరాలను అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వివేకా హత్య కేసులో విచారణకు రావాల్సిందిగా కడప ఎంపీకి నోటీసులు జారీ చేసింది సీబీఐ. మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసులో సీబీఐ పేర్కొంది.
ఇదీ చదవండి : రెబల్ ఎంపీ.. ఈ సారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? ప్లేస్ ఫిక్స్ అయ్యిందా?
ఈ కేసు విషయానికి వస్తే.. 2019 మార్చి 15వ తేదీన వివాకనంద సొంత ఇంట్లోని బాత్రూమ్లోనే ఆయనను అత్యంత దారుణంగా నరికి చంపారు దుండగులు. 2019 ఎన్నికలకు ముందు జరిగిన ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. వివేకా హత్య కేసు నాటి నుంచి నేటి వరకు ఎన్నో మలుపులు తిరిగింది. కోర్టు, కేసులు, దోషులు, సాక్షులు, సీబీఐ విచారణ, ఇతర రాష్ట్రాలకు కేసు బదలాయించడం ఇలా ఈ కేసులో ఎన్నో మలుపులు కనిపిస్తూనే ఉన్నాయి. అయితే తాజా నోటీసులు.. అధికార వైసీపీకి కాస్త ఇబ్బందికర పరిణామమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..
వైఎస్ వివేకానందారెడ్డి కుమార్తె వైఎస్ సునీత అభ్యర్థన మేరకు కేసును సీబీఐకు అప్పగించింది హైకోర్టు. అప్పటి నుంచి కేసు దర్యాప్తులో పలువురు నిందితులను అరెస్ట్ చేశారు. తాజాగా వైఎస్ అవినాష్ను ఈ కేసులో విచారించనుంచడంతో మరో కొలిక్కి తిరిగింది. అయితే ఐదు రోజుల తర్వాత విచారణకు వస్తానన్న అవినాశ్ రెడ్డి లేఖపై సీబీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Kadapa, YS Avinash Reddy, Ys viveka murder case