D Prasad, News18, Kadapa
దానవుల పాడు ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన ప్రాచీన చరిత్ర ఉంది. జైన మతానికి సంబంధించిన ఆనవాళ్లు దొరికిన ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతం చూడటానికి చాల ప్రశాంతంగా ఉంటుంది. పెన్నా నది ఒడ్డున దట్టమైన ఇసుక తిన్నెల్లో ఏకాంతంగా బయలుపడిన పార్ష దేవాలయం మనకు దర్శనమిస్తుంది. రాయలసీమ (Rayalaseema) ప్రాంతంలో మొత్తానికి కడప జిల్లా (Kadapa District) లో బయల్పడిన జైన చారిత్రక ప్రదేశం ఈ పార్శ్య దేవాలయం. ఈ దేవాలయం ప్రొద్దుటూరు పట్టణం నుండి 14 కిలోమీటర్ల దూరంలో జమ్మలమడుగుకి వెళ్ళే రహదారిలో ఉన్న ఈ దానవులపాడు క్రీ.శ. 6వ శతాబ్దంలో జైన మత పీఠంగా ప్రాచుర్యం పొందిందని చరిత్రకారులు చెపుతున్నారు.
స్థానికుల కథనం ప్రకారం పూర్వం ఇద్దరు దంపతులు ఇక్కడ పని చేసుకుంటుండగా వారికి గుడి కనిపించగా 1904లో ఇక్కడ వున్నా ఇసుకను ప్రభుత్వం వారు తవ్వించారు. ఈ తవ్వకాలలో రెండు దేవాలయాలు, పది అడుగుల ఎత్తు గల పార్శ్వనాథుని విగ్రహం శిథిలమైన నవగ్రహాల మండపం, చెక్కిన మూడడుగుల రాయి, పెద్ద బావి, కొన్ని శిలా శాసనాలు ఆ త్రవ్వకాలలో బయటపడ్డాయి.
వీనిలో పార్శ్వనాథుని విగ్రహం, మరొక నవగ్రహ గుడి మాత్రం ఇప్పటికి దానవులపాడులో ఉన్నాయి. మిగిలిన శిల్పాలను మద్రాసులోని మ్యూజియంలోని భద్రపరిచారని సమాచారం. అప్పటి కాలంలో పెన్నానది వరద తాకిడి నుంచి రక్షణ కల్పించడానికి ఈ దేవాలయానికి తూర్పు, పడమరలలో 7 మైళ్ల పొడవున పెద్ద రాతి బండలతో గోడ నిర్మించారు. నదినుంచి నీరు తెచ్చుకునేందుకు వీలుగా అక్కడక్కడ మెట్లు కట్టారు.
ఆ తరువాతి కాలంలో ఈ దేవాలయం క్రమంగా ఋతు పవనాల ప్రభావంతో ప్రతిఏటా ఇసుక దిబ్బలేర్పడి దానవులపాడు ఆ దిబ్బలతో పూడిపోయింది.ఇసుక దిబ్బలను తొలగించినపిమ్మట ఈ ఆలయాన్ని 1958 నుండి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనికి తీసుకోబడింది. ఇక్కడ ఉన్న పార్స్వ విగ్రహం సుమారు 10 అడుగుల ఎత్తు ఉండి, దిగంబరుడుగా మనకు దర్శనం ఇస్తాడు.
ఈ విగ్రహం సగ భాగం మాత్రమే మనకు కనిపిస్తుంది మిగతా సగభాగం భూమి లోపలికి ఉంటుంది. ఈ పార్శ్య నాధుని వెనుక వైపు ఏడూ పడగల పాము గొడుగులా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని చూడడానికి సుదూర ప్రాంతాలనుండి సందర్శకులు వస్తు ఉంటారని స్థానికులు చెపుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kadapa, Local News