రిపోర్టర్ : ప్రసాద్, న్యూస్ 18 తెలుగు
మన చుట్టూ ఉన్న సమాజంలోనే ఎందరో నేరగాళ్లు మన పక్కనే ఉంటారు. అటువంటి వారిని మనం గుర్తించక పోవచ్చేమో కానీ మన సంరక్షణంలో నిరంతరం ఉండే పోలీసులు మాత్రం వారిని పట్టుకుని తీరుతారు. అటువంటి మోస్ట్ వాంటెడ్ గా వున్న కొందరు అంతర్ రాష్ట్ర దొంగలని కడప జిల్లా పోలీసులు పక్కా ప్రణాళికలతో వారిని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని ఖాజీపేట సమీపంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేపట్టగా, ఆ దారిలో వస్తున్న ఇద్దరు కరడు గట్టిన అంతర్ రాష్ట్ర దొంగలను మైదుకూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి వారిని మీడియా ముందుకు ప్రవేశపెట్టారు.
అరెస్ట్ కాబడిన నిందితుల నుండి సుమారు రూ.10.5 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు దొంగతనాలకు వినియోగించిన రెండు కార్లను స్వాధీనపరచుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. జిల్లా ఎస్పీ కే.కే.ఎన్ అన్బురాజన్ మాట్లాడుతూ అరెస్టైన వారి వివరాలను వెల్లడించారు.
అంతే కాకుండా ఇదివరకు ఈ ఇద్దరు నిందితులపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 42 చోరీ కేసులలో వీరి హస్తం వున్నట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు. ఈ కేసులలో ఆంధ్రప్రదేశ్ లోని వై.ఎస్.ఆర్ జిల్లాలో 28 కేసులు, కర్నూలు జిల్లాలో 8, గుంతకల్ రైల్వే పరిధిలో రెండు, తెలంగాణలో 4 కేసులు వీరిపై నమోదు చేయబడినట్లు తెలిపారు.
ఈ నిందితులను పట్టుకోవడంలో మైదుకూరు డి.ఎస్.పి వంశీధర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రతిభ కనబరిచి మోస్ట్ వాంటెడ్ దొంగలను అరెస్టు చేసి, చోరీ సొత్తు రికవరీ చేశారని.. ఈ సందర్భంగా మైదుకూరు రూరల్ సిఐ నరేంద్ర రెడ్డి, ఖాజీపేట ఎస్ఐ కుళ్లాయప్ప మరియు వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి వారికి నగదు రివార్డులను అందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kadapa, Local News