D Prasad, News18, Kadapa
ఆయనో ప్రభుత్వ ఉద్యోగి. డ్యూటీలో సిన్సియర్ గా ఉంటారు. అందులో భాగంగా తనతో పాటు పనిచేసే వాళ్ల క్రమశిక్షణ నేర్పడమే అతడు చేసిన పాపం. డ్యూటీ సరిగా చేయలేదని పై అధికారులకు చెప్పడం అతడి ప్రాణాలమీదకు తెచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. కడప జిల్లా (Kadapa District) లో ఇటీవల సంచలనం రేపిన పశువైద్య శాఖ డీడీ డాక్టర్ అచ్చన్న కిడ్నాప్, హత్య కేసును పోలీసులు ఛేదించారు. అచ్చన్న ఈనెల 13న అదృశ్యమయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే ఆయన డెడ్ బాడీ లభ్యమైంది. హత్యలో అచ్చెన్న సహోద్యోగులు, అతడి బంధువులను నిందితులుగా గుర్తించారు. విధి నిర్వహణలో వచ్చిన అభిప్రాయబేధాలతోనే హత్య జరిగినట్లు తేల్చారు.
డా.అచ్చన్న 2021 నుండి కడపలోని వెటర్నరీ పాలీ క్లినిక్ లో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. నిందితుడు డా. సుభాష్ చంద్రబోస్ 2022 నుండి అదే ఆసుపత్రిలో అసిస్టెంట్ సర్జన్ గా పనిచేస్తున్నారు. ఐతే విధి నిర్వహణలో నిర్లక్ష్యమో లేక ఇతర కారణాల వల్లో అచ్చెన్న.. అక్కడ పనిచేసే వైద్యులు, ఇతర సిబ్బంది జీతాలను మూడు నెలలపాటు నిలిపేసి సీఎంఎఫ్ఎస్, ఎఫ్ఆర్ఎస్ నుంచి తొలగించడంతో అచ్చెన్నపై కక్ష పంచుకున్నారు. ఈనెల 9న పోరుమామిళ్ల వేళ్లిన సుభాష్ చంద్రబోస్ అక్కడ తన బావమరిది చెన్న కృష్ణ, మెడికల్ స్టోర్ భాగస్వామి అయిన మూడే బాలాజీ నాయక్ తో కలిసి అచ్చెన్న మర్డర్ కు స్కెచ్ వేశారు.
అనుకున్నట్లుగానే ఈనెల 12న చర్చకు వెళ్లిన అచ్చెన్నను కిడ్నాప్ చేశారు. అక్కడి నుంచి రాయచోటి తీసుకెళ్లి మద్యం తాగించారు. ఆ తర్వాత గువ్వలచెరువు తీసుకెళ్లి అచ్చెన్న చాతీపై బలంగా తన్ని లోయలో పడేశారు. ఈనెల 24న గువ్వల చెరువు ప్రాంతంలో అచ్చెన్న మృతదేహం లభ్యమైంది. పోలీసులు గాలిస్తున్నారని తెలిసిన నిందితులు వీఆర్వో ఎదుట లొంగిపోయారు. హత్య చేసిన అనంతరం సాక్ష్యాలను చెరిపేసేందుకు యత్నించినట్లు అంగీకరించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరి రిమాండ్ కు తరలించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kadapa, Local News