తిరుమల శ్రీవారి ఆస్తులను వేలం ద్వారా విక్రయించాలనే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయంపై జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ స్పందించారు. టీటీడీ భూములను అమ్మితే అది చెడు సంప్రదాయంగా మారి... ఇతర హిందూ ధార్మిక సంస్థలు కూడా దీన్నే ప్రామాణికంగా తీసుకొని అనుసరించే ప్రమాదం ఉందని జనసేనాని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, కోట్లాదిమంది శ్రీవారి భక్తుల మనోభావాలు, విశ్వాసాలు దెబ్బ తింటాయని వాపోయారు. రాష్ట్ర భవిష్యత్ ఆర్థిక అవకాశాలను ప్రమాదంలో పడేసినట్లవుతుందని అభిప్రాయపడ్డారు పవన్ కల్యాణ్. సోమవారం ఉదయం ట్విటర్ ద్వారా స్పందించిన ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి, టీటీడీకీ పలు ప్రశ్నలు సంధించారు.
ప్రభుత్వానికి, టీటీడీకీ పవన్ కల్యాణ్ సూటి ప్రశ్నలు:
• టీటీడీకి ఈ భూములను అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది?
• ఉన్న భూములను లీజుకు ఇవ్వడం ద్వారా కానీ లేదా వాణిజ్యపరమైన అవసరాలకు ఉపయోగించే విధంగాకానీ అభివృద్ధి చేసి యాజమాన్య హక్కులు పోగొట్టుకోకుండా ఆదాయవనరులు పొందేందుకు టి.టి.డి. ఎందుకు ప్రయత్నం చేయలేకపోతోంది?
• ఈ భూముల అమ్మకాల ద్వారా టి.టి.డి. ఏ మేరకు లబ్ది పొందబోతోంది? దీనికి సంబంధించి ఏమైన సరైన వివరణలు ఇచ్చారా?
• ఈ భూములను అమ్మడం ద్వారా టి.టి.డి. తన ధార్మిక లక్ష్యాలకు, విలువలకు చేరువ కాగలుగుతుందా?
• కోట్లాదిమంది భక్తుల ద్వారా, ప్రజల ద్వారా టి.టి.డి.కి భారీగా విరాళాలు అందుతున్నాయి. టి.టి.డి. తమ భూములను ఎందుకు అమ్మి వేస్తోందో తెలుసుకొనే హక్కు వారికి లేదా?
• గతంలో టి.టి.డి. తమ భూముల అమ్మకాల కోసం గౌరవ రాష్ట్ర హైకోర్టు నుంచి అనుమతులు పొందిన సందర్బాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు కూడా భూముల అమ్మకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టు నుంచి అనుమతులు పొందాలని టి.టి.డి.ని ఆదేశించగలదా?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Pawan kalyan, Tirumala Temple, Tirumala tirupati devasthanam, Ttd