Pawan Kalynal on AP Corona Cases: తెలుగు రాష్ట్రాలలో నమోదవుతున్న కరోనా కేసులు (Corona Cases), తాజా గణాంకాలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ప్రత్యక్షంగా సేవలు అందించే ఆరోగ్య సిబ్బంది ముఖ్యంగా డాక్టర్లు, వైద్య సహాయకులు, వైద్య విద్యార్థులతోపాటు పోలీసులు, స్థానిక సంస్థల సిబ్బంది, మీడియా ఉద్యోగులు అధిక సంఖ్యలో కోవిడ్ బారినపడుతున్నారని వస్తున్న వార్తలు విచారం కలిగిస్తున్నాయన్నారు. అలాగే ప్రజా ప్రతినిధులు, రాజకీయవేత్తలు కూడా కోవిడ్ బారిన పడుతుండడం దీని తీవ్రతను తెలియచేస్తోందని.. అందరూ కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తాజాగా తెలుగుదేశం (Telugu Desam) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)కూడా కరోనాతో అస్వస్థతకు గురికావడం విచారకరమన్నారు. ఆయన త్వరగా కోలుకుని ప్రజల కోసం ఎప్పటిలాగే పని చేయాలని పవన్ ఆకాంక్షించారు. అయితే ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం వ్వవహరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. ప్రస్తుత పరిస్థితులలో తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వాలు మరింత అప్రమత్తతతో కోవిడ్ నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు. రెండు రాష్ట్రాల్లోనూ కోవిడ్ పరీక్షలు పెంచడం ద్వారా వైరస్ సోకినవారిని త్వరితగతిని గుర్తిస్తే.. వైద్యం చేసే అవకాశం కలుగుతుందన్నారు.
కరోనా థర్డ్ విస్తరిస్తున్న నేపథ్యంలో.. పరీక్ష కేంద్రాలు పెంచాలని సూచించారు. మొబైల్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఎక్కువ ఉంటుంది అన్నారు. అలాగే కరోనా మొదటి వేవ్ సమయంలో పాటించిన ట్రాక్ అండ్ ట్రేస్ విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ లో రాత్రి వేళ కర్ఫ్యూ, సమావేశాలు, వేడుకలపై పాక్షిక నిషేధాలు మంచి నిర్ణయమే అన్నారు. అయితే ప్రస్తుతం కరోనా తీవ్రంగా విస్తరిస్తుంటే.. పాఠశాలల్లో తరగతుల కొనసాగింపు సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలన్నారు.
ఇదీ చూడండి : బావల కోసం బాలయ్య తాపత్రయం..? ఆ ఇద్దరినీ ఒక్కటి చేస్తారా..? ఇదంతా ఎవరి ప్లాన్
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గే వరకు తరగతులను వాయిదా వేయవలసిందిగా కోరుతున్నాను అన్నారు. పిల్లలకు వాక్సినేషన్ పూర్తికాకపోవడం, వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం వంటి అంశాలు దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవలసిందిగా వైసీపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అన్నారు. కరోనా ఉధృతి పెరుగుతున్న తరుణంలో మద్యం దుకాణాలను మరో గంటపాటు అదనంగా తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం అని మండిపడ్డారు.
ఇదీ చూడండి : ఎన్టీఆర్ మళ్లీ జన్మిస్తారా..? ఆయన ఆత్మ ఏం చెప్పింది..? 26 ఏళ్ల తరువాత బయటపడ్డ రహస్యం..!
మద్యం సరఫరాపై కాకుండా ప్రజలకు నిత్యావసరాలు ఎలా ఇవ్వాలి.. వైద్య సేవలు మెరుగుపరిచేందుకు కార్యాచరణ ప్రకటించాలి అన్నదానిపై ప్రభుత్వం ఫోకస్ చేయాలని కోరారు. వాటి ఊసెత్తకుండా మద్యం అమ్మకాలపై దృష్టి పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో.. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని కోరారు. మాస్క్ లేకుండా దయచేసి బయటకు రావొద్దన్నారు. వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉన్నవారు, పిల్లల విషయంలో అప్రమత్తత పాటించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.