కర్ణాటక కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరిని డిప్యుటేషన్పై ఆంధ్రప్రదేశ్కు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం కర్ణాటకలోని హసన్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న సింధూరి నిజాయితీగా,నిక్కచ్చిగా వ్యవహరిస్తారన్న పేరు ఉంది. ఈ కారణంగానే ఆమె పలుమార్లు బదిలీ అయ్యారు. ఇలాంటి అధికారి రాష్ట్రంలో ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో జగన్ సర్కార్ ఆమెను ఏపీకి రప్పించే ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే సింధూరితో మాట్లాడగా..ఆమె కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలుస్తోంది. సింధూరి జూనియర్ స్థాయి అధికారి కావడంతో డిప్యుటేషన్కు కేంద్రం నుంచి పెద్దగా అడ్డంకులేవి ఉండకపోవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది. సీనియర్ స్థాయి అధికారుల డిప్యుటేషన్కు మాత్రమే కేంద్రం ఆంక్షలు విధిస్తుందని.. జూనియర్ల డిప్యుటేషన్కు అలాంటి ఇబ్బందులేమి ఉండవని అధికార వర్గాలు చెబుతున్నాయి.ఇక కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే ఆలస్యం సింధూరిని రాష్ట్రానికి తీసుకొచ్చే పనిలో నిమగ్నమైంది ప్రభుత్వం.ఇదిలా ఉంటే, 2009 బ్యాచ్కు చెందిన రోహిణి సింధూరి స్వగ్రామం ఖమ్మం జిల్లా రుద్రాక్షపల్లి. నెల్లూరు జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త సుధీర్రెడ్డిని ఆమె వివాహం చేసుకున్నారు.
Published by:Srinivas Mittapalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.