సిమ్స్ (SVIMS) ఆస్పత్రికి భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) భారీగా విరాళం ప్రకటించింది. స్విమ్స్ (Sri Venkateswara Institute Of Medical Sciences) హాస్పిటల్లో వైద్య పరికరాల కొనుగోలు కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ రూ.22 కోట్లు విరాళంగా అందించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం టీటీడీ పరిపాలన భవనంలోని ఈవో ఛాంబర్లో టీటీడీ (Tirumala Tirupati Devasthanam) ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి సమక్షంలో ఐఓసీఎల్, స్విమ్స్ అధికారులు ఎంఓయు కుదుర్చుకున్నారు.
ఈ సందర్భంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మార్కెటింగ్ డైరెక్టర్ శ్రీ సతీష్ కుమార్ మాట్లాడుతూ... స్విమ్స్లో రోగులకు వైద్య సహాయం అందించడానికి కార్పొరేట్ సామాజిక బాధ్యతగా ఈ నిధులను అందించడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి టీటీడీ తిరుమలలో భక్తులకు, సిమ్స్, బర్డ్, చిన్న పిల్లల ఆసుపత్రుల్లో రోగులకు అందిస్తున్న సేవలను వివరించారు.
తిరుపతి ఎంపి డాక్టర్ గురుమూర్తి, జేఈవో శ్రీమతి సదా భార్గవి, సిమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, ఎఫ్ఏసీఏవో శ్రీ బాలాజీ, సిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, ఐఓసీఎల్ ఎపి, తెలంగాణ ఇంచార్జ్ శ్రీ అనిల్ కుమార్, రాయలసీమ రీజనల్ హెడ్ శ్రీ రోహిత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మరోవైపు తిరుపతికి చెందిన ఆల్ ఇండియా ఆర్యవైశ్య వాసవి నిత్య అన్నదాన ట్రస్టు ప్రెసిడెంట్ ఉమామహేశ్వరి దంపతులు టీటీడీ ఎస్వీబీసీ ట్రస్ట్కు (TTD SVBC Trust)కి రూ. 10 లక్షలు విరాళం అందించారు. ఈ మేరకు విరాళం డీడీని శుక్రవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈవో ధర్మారెడ్డికి అందజేశారు.
కాగా, ఫిబ్రవరి 3న శుక్రవారం 57,147 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 26,94 మంది తలనీలాలను సమర్పించారు. హుండీ కానుకల రూపంలో నిన్న తిరుమల శ్రీవారికి 3.78 కోట్ల ఆదాయం వచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Local News, Tirumala, Tirupati