భారత వాతావరణ విభాగం రెండు తెలుగు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే ఐదు రోజులపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు తమిళనాడు, మహారాష్ట్రలోనూ ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. విశాఖపట్నం సహా తీరప్రాంతాల్లో మత్స్యకారులందరూ ఈనెల 13 వరకు చేపల వేటకు వెళ్లకపోవడం మంచిదని సూచించింది. ఉపరితల ఆవర్తనం, రాబోయే మూడు రోజుల్లో ఏర్పడబోయే అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. కాగా, ఇప్పటికే నెల్లూరు సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వివరాలివి..
రానున్న మూడు రోజుల్లో ఏపీతో పాటు తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ శనివారం నాడు హెచ్చిరంచింది. పశ్చిమ నైరుతి మధ్య బంగాళాశాతంలో ఏపీ మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, సముద్రమట్టానికి 8.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని, దీని కారణంగా రెండు రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. మరోవైపు
ఈ నెల 9న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తం కొనసాగుతోందని, ఈ నెల 9 నాటికి అది అల్పపీడనంగా మారనుందని వివరించింది. క్రమేపీ అది బలపడి వాయవ్య దిశగా పయనిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర తమిళనాడులోనూ, దక్షిణ కోస్తాంధ్రలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ వివరించింది. ఈ నెల 11, 12 తేదీల్లో దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఈ నెల 9, 10 తేదీల్లో తమిళనాడులో, 10, 11, 12 తేదీల్లో దక్షిణ కోస్తాంధ్రలోనూ సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరించింది. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు ఈ నెల 9 లోపు తీరప్రాంతాలకు చేరుకోవాలని స్పష్టం చేసింది. నెల్లూరు జిల్లాలోని అల్లూరు మండలంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శనివారం మండలంలో కుండపోత వర్షం కురిసింది. దీంతో అన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP News, Rains, Telangana, Weather report