ఛత్తీస్గఢ్లో జరిగిన మావోయిస్టుల దాడిలో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ శాఖమూరి మురళీకృష్ణ అమరుడైన సంగతి తెలిసిందే. మురళీకృష్ణ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మురళీకృష్ణ మృతదేహం సోమవారం అర్ధారాత్రి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఛత్తీస్గఢ్ నుంచి ఇండిగో ఎయిర్లైన్స్ విమానంలో రాత్రి 11.40 గంటలకు ఇక్కడికి తీసుకువచ్చారు. మురళీకృష్ణ మృతదేహానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఏడీజీపీ వీసీ సజ్జనార్, సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు, తెలంగాణ పోలీసులు నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్దాంజలి ఘటించారు. సజ్జనార్తో పాటు సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు స్వయంగా శవపేటికను మోశారు.
ఈ సందర్బంగా జవాన్ మురళీకృష్ణ కుటుంబ సభ్యులకు వీసీ సజ్జనార్ సంతాపం తెలిపారు. తెలంగాణ పోలీసులు మురళీకృష్ణ కుటుంబానికి అండగా ఉంటారని చెప్పారు. అనంతరం మురళీకృష్ణ మృతదేహాన్ని అతని స్వస్థలమైన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా, సత్తెనపల్లి మండలం, గుడిపూడి గ్రామానికి తరలించారు. అక్కడ మురళీకృష్ణ మృతదేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి.
సీఆర్పీఎఫ్ జవాను శాఖమూరి మురళీకృష్ణ మావోయిస్టుల ఘాతుకానికి బలికావడంతో అతని స్వగ్రామం గుడిపూడిలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన శాఖమూరి రవీంద్రబాబు, విజయకుమారి దంపతుల చిన్నకుమారుడైన మురళీకృష్ణ ఆరేళ్ల క్రితం సీఆర్పీఎఫ్ జవానుగా చేరారు. కోబ్రా–210 విభాగానికి చెందిన మురళీకృష్ణ ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే గత ఏడాది ఆగస్ట్ 13న వివాహం జరగాల్సి ఉన్నప్పటికీ.. బంధువుల్లో ఒకరు చనిపోవడంతో వాయిదా పడింది. ఈ ఏడాది మే 22న మురళీకృష్ణ వివాహం చేయాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల కిందట కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన మురళీకృష్ణ మే 15న ఇంటికి వస్తానని చెప్పాడు. కానీ ఇంతలోనే మావోల ఘాతుకానికి మురళీకృష్ణ బలయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CRPF, Hyderabad, Sajjanar, Shamshabad Airport