దేశవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ వ్యాధి కల్లోలం సృష్టిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో వేలాది పక్షులు బర్డ్ ఫ్లూ కారణంగా మృత్యువాత పడుతున్నాయి. ఇప్పటికే కేరళ వంటి రాష్ట్రాల్లో ఎమర్జెన్సీని కూడా ప్రకటించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే చాలా చోట్ల పదుల సంఖ్యలో కాకులు, కోళ్లు మృతి చెందడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా గుంటూరు జిల్లా, కొల్లిపర మండలం, హనుమాన్ పాలెంలోని నాటు కోళ్ల ఫామ్ లో కోళ్లు మృతి చెందడం కలకలం రేగింది. గంటల వ్యవధిలోనే వందల కోళ్లు మృతి చెందినట్లు స్థానికులు చెప్తున్నారు. వివరాల్లోకి వెళ్తే హనుమాన్ పాలెంకు చెందిన ఏవీఎం ఫార్మ్స్ లో రాత్రి బాగానే ఉన్న కోళ్లు.. ఉదయానికి నీరసపడిపోయాయి.. శక్తి కోసం గ్లుకోజ్ వాటర్ తాగించిన కొద్దిసేపటికే అవి చనిపోయాయి.
కోళ్ల ఫార్మ్ యజమానికి ఆవుల వినీత్ న్యూస్ 18తో మాట్లాడుతూ ఎప్పటిలాగానే రాత్రి కోళ్లకు మేత పెట్టామని.. ఉదయానికి కోళ్లన్నీ నీరసంగా పడి ఉన్నట్లు తెలిపారు. వెంటనే వాటికి గ్లూకోజ్ నీళ్లు తాగించిన కొద్దిసేపటికే వాటి ముఖాలు తెల్లగా పాలిపోయి మృతి చెందినట్లు తెలిపారు. చనిపోయిన తర్వావ కోళ్ల ముక్కులో నుంచి చిక్కటి ద్రవం కారుతున్నట్లు వివరించారు. అలాగే వాటిని పోస్ట్ మార్టం చేసి చూడగా పేగుల్లో గడ్డలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అప్పటివరకు కోళ్లతో కళకళలాడిన ఫార్మ్ వింత వ్యాధి కారణంగా గంటల వ్యవధిలోనే ఖాళీ అయిందని యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మరోవైపు కోళ్ల నుంచి సేకరించిన శాంపుల్స్ లు ల్యాబ్ కు పంపుతున్నట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు.
బర్డ్ ఫ్లూ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పల రాజు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. బర్డ్ ఫ్లూను ఎదుర్కొనేందుకు క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ను రంగంలో దించుతున్నట్లు ప్రకటించారు. ఒక్కో బృందంలో ఒక పశువైద్యుడు, ఇద్దరు పారా వెటర్నరీ సిబ్బంది మరియు ఇద్దరు సహాయకులను అందుబాటులో ఉంచారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మొత్తం 829 బృందాల ఏర్పాటుకు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని మంత్రి ఆదేశించారు. వీటితో పాటుగా ప్రతీ జిల్లాలో ఉన్న కోళ్ల సంఖ్యను బట్టి 40 నుంచి 140 బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్నారు. ఈ వ్యాధి ప్రధానంగా వలస పక్షుల ద్వారా వస్తున్న నేపథ్యంలో నెల్లూరు, గుంటూరు, పశ్చిమగోదావరి మరియు తూర్పు గోదావరి జిల్లాలలో అదనంగా ప్రత్యేక బృందాలు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆలాగే రాష్ట్రస్థాయిలో బర్డ్ ఫ్లూ వ్యాధి నిర్ధారణ, నివారణ మరియు నివారణ కోసం శిక్షణ పొందిన ఐదుగురు పశువైద్యులతో స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో చనిపోయిన కాకులను పరీక్షించిన ప్రత్యేక బృందం.., వాటికి బర్డ్ ఫ్లూ లేదని నిర్ధారించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Bird Flu, Gunturu