Ration Card Apply AP : కరోనా నేపథ్యంలో ఏ ఒక్కరూ పస్తులతో పడుకోవద్దని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రేషన్ కార్డు లేకున్నా అర్హులైతే బియ్యం అందజేయాలని ఆయన ఆదేశించారు. దీంతో.. వీలైతే ఐదు రోజుల్లోనే రేషన్ కార్డు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులకు తెలిపారు. మీడియాతో మాట్లాడిన మంత్రి.. రేషన్ సరుకుల పంపిణీలో ఇబ్బందులు అదిగమించేలా చర్యలు చేపట్టామన్నారు. రేషన్ తో పాటు రూ.వెయ్యి నగదు సాయం అందనివారికి త్వరలోనే అందించనున్నట్లు తెలిపారు. బుధవారం నుంచి రెండో విడత రేషన్ అందిస్తామని.. రేషన్ షాపులకు అదనంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వాలంటీర్ల ద్వారా రేషన్దారులకు కూపన్లు అందిస్తున్నామన్నారు. కూపన్ల మీద ఉన్న సమయానికి వచ్చి రేషన్ తీసుకోవాలని ప్రజలకు సూచించారు.
కాగా, ఏపీ ప్రభుత్వం దారిద్య్రపు రేఖకు దిగువన ఉన్నవారికి తెల్ల రేషన్ కార్డు, ఎగువన ఉన్నవారికి పింక్ రేషన్ కార్డును అందజేస్తోంది. ఇందులో ఏ కార్డు పొందాలన్నా కనీసం వారం సమయం పడుతుంది. కానీ ప్రస్తుతం ఐదు రోజుల్లోనే కార్డు ఇచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రేషన్ కార్డు పొందేందుకు ముందుగా.. రేషన్ కార్డు కోసం దరఖాస్తు ఫారం నింపాలి. ఇవి అన్ని మీసేవ కేంద్రాల్లో దొరుకుతాయి. లేకపోతే మీసేవ అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తును నింపాక.. దానికి అవసరమయ్యే ఆధార్, ఓటర్ కార్డు, ఇంటి అడ్రస్ తెలిపే తదితర డాక్యుమెంట్లు జత చేయాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తును తీసుకెళ్లి మీసేవ సెంటర్లో అందజేసి, ఫీజు చెల్లించాలి.
మీసేవ నిర్వాహకులు ఇచ్చే నంబరుతో కూడిన స్లిప్ను భద్రపర్చుకోవాలి. ఒకవేళ మీరు అర్హులైతే రేషన్ కార్డు మంజూరైనట్లు మొబైల్ నంబరుకు మెసేజ్ వస్తుంది. అప్పుడు స్లిప్ తీసుకెళ్లి మీసేవలో అందజేసి రేషన్ కార్డును పొందవచ్చు. అంతేకాకుండా.. ‘స్పందన’ యాప్ లేదా 1800 452 4440, 1100 టోల్ఫ్రీ నంబర్లకు కాల్ చేసి కూడా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.