ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ‘జగనన్న తోడు’ అనే పథకాన్ని తీసుకొచ్చింది. చిరు వ్యాపారులు, చేతి వృత్తుల కళాకారుల కోసం వైసీపీ సర్కారు ఈ పథకాన్ని తీసుకొచ్చింది. తోపుడు బండ్ల మీద వ్యాపారాలు చేసుకునే వారు, రోడ్డుపక్కన బుట్టల్లో పళ్లు, ఇతరత్రా సరుకులు విక్రయించే వారికి ఆర్థికంగా తోడ్పాటు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద లబ్ధి పొందాలంటే ఉండాల్సిన అర్హతలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. లబ్ధిదారులను ఎలా ఎంపిక చేయాలి? ఎంపిక చేసిన వారికి ఎలా ఆర్థిక సాయం అందించాలి? ఆర్థిక ప్రయోజనం పొందిన వారు మళ్లీ తిరిగి ఎలా చెల్లించాలనే అంశాలను సవివరంగా అందులో పేర్కొంది.
జగనన్న తోడు ఎవరికి వర్తిస్తుంది?
చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు, చేతి వృత్తుల వారికి ఈ పథకం వర్తిస్తుంది. ఒక్కొక్కరికి వర్కింగ్ కేపిటల్ కింద రూ.10,000 రుణం అందిస్తారు. సున్నా వడ్డీ కింద ఈ రుణం ఇస్తారు. బ్యాంకు ద్వారా ఇచ్చే ఈ రుణాన్ని తిరిగి 12 ఈఎంఐల్లో లబ్ధిదారులు చెల్లించాలి. రూ.10,000 రుణానికి ప్రతి నెలా వడ్డీని కూడా లబ్ధిదారు చెల్లించాలి. అయితే, ప్రతి మూడు నెలలకు ఆ వడ్డీని ప్రభుత్వం తిరిగి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తుంది. దీనికి ఎలాంటి ష్యూరిటీ అవసరం లేదు.
18 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు కలిగిన వారు అయి ఉండాలి
నెలకు గ్రామీణ ప్రాంతాల్లో రూ.10,000, పట్టణ ప్రాంతాల్లో రూ.12,000 కంటే తక్కువ ఆదాయం ఉండే వారు
3 ఎకరాల కంటే తక్కువ చిత్తడి భూమి ఉన్నవారు లేదా 10 ఎకరాల కంటే తక్కువ మెట్ట ఉన్న వారు. లేదా రెండూ కలిపి 10 ఎకరాల కంటే తక్కువ ఉన్నవారు
ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, ప్రభుత్వం గుర్తింపు పొందిన ఐడీ కార్డు ఉన్నవారు
5*5 చదరపు అడుగుల కంటే తక్కువ విస్తీర్ణంలో దుకాణం ఉన్నవారు
లబ్ధిదారులు గ్రామ, వార్డు వాలంటీర్లకు దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత గ్రామ, వార్డు వాలంటీర్లు సర్వే చేస్తారు. వాలంటీర్లు రిపోర్టు ఇచ్చిన తర్వాత అర్హులైన లబ్ధిదారుల జాబితాను వార్డు, గ్రామ సెక్రటేరియట్లో ప్రదర్శిస్తారు. అర్హత ఉన్నా కూడా తమ పేరు లేకపోతే వారు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. అర్హులైన వారికి బ్యాంకు అకౌంట్లు లేకపోతే వారికి గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేయిస్తారు.
లోన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది?
మొదట అర్హులైన వారు గ్రామ, వార్డు వాలంటీర్లకు దరఖాస్తు పత్రాలు అందజేయాలి. లేకపోతే గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా అందించవచ్చు. ఆ దరఖాస్తులు అన్నిటినీ కలిపి జిల్లా కలెక్టర్ బ్యాంక్ అధికారులకు పంపుతారు. బ్యాంకులు వాటిని పునఃపరిశీలించి అర్హులైన వారి బ్యాంకు ఖాతాల్లో రూ.10,000 జమ చేస్తాయి. ఆయా వివరాలను వార్డు, గ్రామ సచివాలయాలకు వాలంటీర్ల ద్వారా తెలియజేస్తారు. సక్రమంగా రుణం చెల్లించే వారికి వడ్డీ తిరిగి చెల్లించే అంశాన్ని వార్డు, గ్రామ, సచివాలయాల్లో ఉద్యోగులు బ్యాంకులతో చర్చించి ప్రాసెస్ చేస్తారు.
ప్రధానమంత్రి స్వనిధి పేరుతో రోడ్డుపక్కన వ్యాపారాలు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం ఓ పథకం తీసుకొచ్చింది. కేంద్రం కూడా ఇలాగే రూ.10,000 రుణం అందిస్తుంది. పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారులకు 7శాతం వడ్డీని కేంద్రం తిరిగి చెల్లిస్తుంది. ఆ మిగిలిన వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు తిరిగి చెల్లిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.