YCP vs Rebel: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మొన్నటి వరకు అధికార పార్టీ వర్సెస్ ప్రతిపక్షాలుగా ఉన్న వార్.. ఇప్పుడు వైసీపీ నేతల మధ్య సవాల్ గా మారింది. ఇప్పటికే రెబల్ గా మారిన ఆ ఎమ్మెల్యేలు.. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తరువాత మరింత దూకుడుగా వెళ్తున్నారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లా (Nellore District) నేతలు అయితే సవాళ్లతో సై అంటున్నారు. తాజాగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల తరువాత అమరావతికి అనుకూలమైన ప్రభుత్వం రాబోతుందని, మూడు ముక్కలు అన్న వాళ్లు కొట్టుకు పోతారని జోస్యం చెప్పారు. రాజధాని రైతుల ఉద్యమం 1200 రోజుకు చేరుకున్న నేపథ్యంలో ఆయన వారికి సంఘీభావం ప్రకటించారు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ (Amaravati) రాజధానిగా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తీసుకున్న నిర్ణయం సముచితమని గతంలో తామంతా సమర్థించామని.. వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా అమరావతిని స్వాగతించారని గుర్తు చేశారు. ఇప్పుడు మాట తప్పడం, మడమ తిప్పడం ఏంటి..? జగనన్నా ఇది న్యాయమా, ధర్మమా అంటూ కోటం రెడ్డి ప్రశ్నించారు.
ఆనాడు ముద్దు అయిన అమరావతి ఇప్పుడు ఎందుకు వద్దు అయిందని ముక్కుసూటిగా అడిగారు. జగన్ మూడుముక్కల రాజధాని నిర్ణయం మార్చుకోవాలని కోరారు. వైసీపీలో ఉన్నప్పుడు పార్టీకి కట్టుబడి ఉన్నామని, ఇప్పుడు స్వేచ్ఛగా మాట్లాడుతున్నానని అన్నారు. ప్రధాని మోదీ గట్టిగా చెబితే రాజధాని ఎక్కడికి పోదని విశ్వాసం వ్యక్తం చేశారు.
అమరావతి రైతులు తన నియోజకవర్గంలో పాదయాత్ర చేసినప్పుడు ఆశ్రయం ఇచ్చానని అప్పటి నుంచే వైసీపీలో తనకు కష్టాలు మొదలయ్యాయని కోటంరెడ్డి గతాన్ని గుర్తు చేశారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అమరావతి నుంచి మట్టి పెళ్ళ కూడా తీసుకెళ్ళలేరని అన్నారు. అమరావతికి అండగా వున్న పార్టీ త్వరలో రాజకీయ సునామి సృష్టిస్తుందన్నారు. ఆ సునామీలో అమరావతిని ముక్కలు చేయాలనుకొనే వారు కొట్టుకుపోతారని జోస్యం చెప్పారు. అమరావతి కోసం ప్రాణ త్యాగం చేసిన వారికోసం ప్రపంచంలో ఎత్తైన స్మారక స్తూపం ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు.
ఇదీ చదవండి : వచ్చే ఎన్నికల్లో గెలుపు ఎవరిది..? కేంద్రం చేతిలో కీలక రిపోర్ట్..
కేవలం కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రమే కాదు.. మేకపాటు చంద్రశేఖర్ రెడ్డి సైతం అధినేతకు సవాళ్లు విసురుతున్నారు. అయితే అదే స్థాయిలో అక్కడి వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. దీంతో నెల్లూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడ ఒకప్పుడు టీడీపీ వర్సెస్ వైసీపీ గా ఉన్న వార్.. ఇప్పుడు వైసీపీ నేతల మధ్యే మాటల తూటాలు పేలేలా చేస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amaravati, Andhra Pradesh, Ap cm jagan, AP News, Kotamreddy sridhar reddy