అన్నా రఘు, గుంటూరు ప్రతినిధి, న్యూస్18
ఈజీ మనీ.. ప్రతి ఒక్కరి ఛాయిస్. సులువుగా డబ్బులు సంపాదించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఆ డబ్బుతో ఏమైనా చేయొచ్చనే ఆశ చాలా ఉంటుంది. అలా జల్సాలకు అలవాటు పడిన కొందరు యువకులు తమ జీవితాలను అగాథంలోకి నెట్టుకుంటున్నారు. ఈజీగా డబ్బు సంపాదించాలని యువత పెడదోవ పడుతున్నారు. ఆలా దారిలో వెళ్లి తమ జీవితాలను చీకటిమయం చేసుకుంటున్నారు. డబ్బు మాయలో పడి క్రికెట్ బెట్టింగులు గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. అంతేకాదు ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తూ పోలీసులకు చిక్కి ఊచలు లెక్కిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్లకు చెందిన చెందిన ముగ్గురు యువకులు ఇలా ఈజీ మనీ కోసం గంజాయిని తరలిస్తూ మిర్యాలగూడ వద్ద పోలీసులకు దొరికారు. పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకి పంపారు. వీరిని ఉన్నత చదువులు చదివించి ప్రయోజకులుగా తీర్చి దిద్దాలాలని తల్లితండ్రుల కలలన్ని ఆవిరైపోయాయి.
పిడుగురాళ్ల కు చెందిన బిటెక్ విద్యార్థి పోచమల్లు సురేష్, జెనిటిక్ ఇంజనీరింగ్ చదువుతున్న చల్లా రాహుల్ రెడ్డి, డిగ్రీ చదువుతున్న జాస్తి జీవన్ కుమార్ ముగ్గురు జల్సాలకు అలవాటుపడ్డారు. ఇంట్లో డబ్బులు ఇవ్వకపోవడంతో ఈజీ మనీ కోసం గంజాయి అక్రమ రవాణా చేయాలని నిర్ణయించుకున్నారు. వారు ముగ్గురు కలసి తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలోని సారపాకలో పద్నాలుగు కేజీల గంజాయిని కొనుగోలు చేసి పిడుగురాళ్ల చేరుకున్నారు. గంజాయిని విక్రయించేందుకు హైదరాబాద్ లో బేరం కుదుర్చుకున్నారు. గంజాయిని హైదరాబాద్ లో డెలివరీ చేసి డబ్బు చేసుకునేందుకు బయలుదేరారు.
అద్దంకి-నార్కట్ పల్లి రహదారిలో బులెట్ వాహనం పై వెళ్తుండగా మిర్యాలగూడ రూరల్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ఇంతలో ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న యువకుల్ని పట్టుకున్నారు. వారి ప్రవర్తనలో తేడా రావడంతో అనుమానిచి విచారించగా గంజాయి గుట్టు బయటపడింది. వారి బ్యాగులను పరిశీలించగా వాటిలో 14కేజీల గంజాయి లభ్యమైంది. దీంతో వారిని అరెస్ట్ చేసి ముగ్గురిని రిమాండ్ కి తరలించారు. వారి వద్ద నుండి బులెట్ బైక్, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని విచారిస్తున్నారు.
వీరితో ఎవరైనా గంజాయి స్మగ్లింగ్ చేయిస్తున్నారా..? లేక వీరే నేరుగా పండించేవారి దగ్గర కొనుగోలు చేసి విక్రయిస్తున్నారా..? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అలాగే వీరు ఎంతకాలంగా స్మగ్లింగ్ చేస్తున్నారు..? అలాగే హైదరాబాద్ లో ఎవరికి విక్రయించడానికి వెళ్తున్నారు..? వీరిని సంప్రదించిన కొనుగోలుదారులెవరేనేదానిపై కూపీలాగుతున్నారు. గతంలో వీరికి గంజాయి సప్లై చేసిన రికార్డుందా అనే కోణంలో గుంటూరు జిల్లా పోలీసులను సంప్రదిస్తున్నారు. వీరు గంజాయేనా లేక మద్యం కూడా అక్రమ రవాణా చేస్తున్నారా..? అనే వివరాలు కూడా సేకరిస్తున్నారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా సమాచారమిచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Crime news, Ganja case, Guntur