రిపోర్టర్: విజయ్ కుమార్
లొకేషన్: గుంటూరు
గుంటూరు (Guntur) జిల్లా తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది.సమావేశంలో పాల్గొన్న వైసీపీ (YSCRP), టీడీపీ (TDP) కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. నవరత్నాల పథకంలో భాగంగా 'గడప గడపకు మీ ప్రభుత్వం' పనుల్లో సింగిల్ టెండర్ ఆమోదం అంశంపై టీడీపీ సభ్యుడు అభ్యంతరం తెలిపారు.వైసీపీ కౌన్సిలర్లు ఆయనను మాట్లాడకుండా కూర్చోమని ఎదురుదాడికి దిగారు. టీడీపీ సభ్యుడు.. తనకు మాట్లాడే అవకాశం లేదా..? మీరే కూర్చోండి.. అని బదులిచ్చారు. దాంతో వైసీపీ 33 వ వార్డ్ కౌన్సిలర్ టీడీపీ కౌన్సిలర్ పై తీవ్రంగా దాడి చేశారు .
కౌన్సిలర్లు అందరు అడ్డుకుంటున్నా కూడా ఆగకుండా వెంటపడి మరీ పదేపదే దాడి చేశారు. అనంతరం దాడికి నిరసనగా తెదేపా కౌన్సిలర్లు పోడియం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదని వారు భీష్మించుకు కూర్చున్నారు. దాడి అనంతరం వైసీపీ కౌన్సిలర్లు సమావేశం నుంచి వెళ్లిపోయారు.చైర్మన్ వివరణ ఇచ్చేవారకు ఇక్కడే బైఠాయిస్తామని దాడి చేసిన వైసీపీ కౌన్సిలర్లను వెంటనే సస్పెండ్ చెయ్యాలని టీడీపీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు.
అధికారం ఉందని శాసనసభలో మొన్న ఒక దళిత శాసనసభ్యుడి పై దాడిచేశారని, ఇప్పుడు వారిని రోల్ మోడల్ గా తీసుకుని కౌన్సిలర్లు దాడులకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చలాంటివని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Guntur, Local News