గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అధికారులు రోడ్డు విస్తరణలో భాగంగా ప్రజల నివాసాలను, ప్రహరీ గోడలను రెండు జేసీబీల సహాయంతో కూల్చివేస్తున్నారు. అయితే ఈ కూల్చివేతలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. ఈ నిరసనల మధ్య కూడా అధికారులు కూల్చివేత పనులు కొనసాగిస్తున్నారు. కనీసం ఆర్టీసీ బస్సు కూడా రాని గ్రామానికి ఆరు లైన్ల రోడ్డు ఎందుకని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
కాగా గతంలో కూడా ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతలు జరిగిన విషయం తెలిసిందే. అలాగే ఆ సమయంలో ఇప్పటం బాధితులు హైకోర్టును ఆశ్రయించగా..కోర్టు ఇళ్ల కూల్చివేతపై స్టే ఇచ్చింది. అయితే ఇప్పటం బాధితులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు. ఆయనే స్వయంగా ఇప్పటంకు వెళ్లి బాధితులకు సానుభూతి తెలిపారు. అంతేకాదు ఒక్కొక్క కుటుంబానికి రూ. లక్ష చొప్పున పార్టీ తరపున అందజేశారు. జనసేన కార్యక్రమానికి ఇప్పటం గ్రామస్థులు స్థలాలు ఇచ్చారనే కక్ష గట్టి ఇళ్ల కూల్చివేత చేపట్టారని వైసీపీపై అప్పట్లో పవన్ మండిపడ్డారు.
ఇక ఇప్పుడు మరోసారి ఇప్పటంలో ఇళ్ల కూల్చివేత ప్రక్రియ కొనసాగుతుంది. దీనిపై జనసేన పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు. ఈ కూల్చివేతలతో వైసీపీ పైశాచిక ఆనందం పొందుతుంది. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా బాధితులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని నాదెండ్ల తెలిపారు.
ఇప్పటంలో కూల్చివేతలతో వైసీపీ పైశాచికానందం - శ్రీ @mnadendla గారు
Link: https://t.co/9VlxxKkfWL — JanaSena Party (@JanaSenaParty) March 4, 2023
ఇప్పటివరకు 12 ఇళ్లకు సంబంధించిన ప్రహారీలను తొలగించారు. ఇళ్ల తొలగింపు నేపథ్యంలో పోలీసులు భారీగా చేరుకున్నారు. ఎక్కడా కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ కూల్చివేతలను స్థానికులు అడ్డుకుంటున్నారు. నోటీసులు కూడా ఇవ్వకుండా అకస్మాత్తుగా కూల్చివేత ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhrapradesh, Ap, AP News, Guntur