Anna Ragu, Guntur, News18
పల్నాడు. ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh)చరిత్రలో పల్నాడుకు ప్రత్యేక స్థానముంది. పల్నాడు అంటేనే పౌరుషాల పురిటిగడ్డ. దాదాపు వెయ్యేళ్ల ఏళ్ల క్రితం జరిగిన పల్నాటి యుద్ధం పేరు చెబితే ఇప్పటికీ ఆ ప్రాంతంలోని వారికి రోమాలు నిక్కబొడుస్తాయి. పల్నాటి వీరులను ఇప్పటికీ స్థానికులు దైవాల్లా కొలుస్తారు. అక్కడివారికి వీరులను తలుచుకోని రోజంటూ ఉండదు. ప్రస్తుతం పల్నాడులో వీరుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పల్నాటి వైభవం, ఉత్సాల చరిత్రను పరిశీలిస్తే.. పల్నాటి యుద్దం ముగిశాక కారంపూడిలో ఆశయసిద్ది కోసం యుధ్దంలో మరణించిన వీరులకు గుడికట్టించి వీరాచార ఉత్సవాలు ప్రతి యేటా నిర్వహిస్తుంటారు. కార్తీక అమావాస్య నాడు ప్రారంభమయ్యే ఆరాధనోత్సవాలు ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు. ఐదు రోజుల పాటు జరిగే ఉత్సవాకు చాలా ప్రాముఖ్యత ఉంది.
11వ శతాబ్ధంలో పల్నాటి యుద్ధం ముగిసిన తరువాత బ్రహ్మనాయుడు ఆశయసిద్ది కోసం యుధ్దంలో మరణించిన 66 వీరనాయుకులకు గుర్తులుగా 66 వీరకల్లును ప్రతిష్ఠించి వీరాచారపీఠం స్థాపించి దానికి పిడుగు వంశంవారిని పీఠాధిపతిగా నియమించారు. ఆ వీరకల్లులు, వీరాచారపీఠం ఉన్నదే వీరులగుడి (వీర్లదేవాలయం). ఈ గుడి గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని కారంపూడి పట్టణంలో నాగులేరు ఒడ్డున ఉంది. యుద్ధంలో మరణించిన వీరులకు దైవత్వాన్ని ఆపాదించి, వారు ఉపయోగించిన ఆయధాలకు పూజల చేసి ఉత్సావాలు జరపడం సాంప్రదాయంగా వస్తోంది.
మహాభారత యుద్ధంలోని ఘట్టాల్లా పల్నాటి యుద్ధానికి అనేక కారణాలున్నాయి. అనుగురాజు పల్నాటి గురజాలను రాజ్యంగా చేసుకొని బ్రహ్మనాయుని మంత్రివర్గంలో పాలించిన సమయంలో నాగమ్మ ఆతిధ్యం స్వీకరించి కానుకను కోరుకోమనటం, అనంతర కాలంలో అనుగురాజు కొడుకైన నలగాముడి పరిపాలనలో కానుకగా మంత్రి పదవిని నాగమ్మ అడగటంతో పల్నాడు చరిత్రకు అంకురార్పణ జరిగింది. అప్పటికే వైష్ణవం ద్వారా సమసమాజ స్థాపన చేయడం ద్వారా ప్రజల్లో బ్రహ్మన్న సుస్థిర స్థానం పొందాడు. ఇదే క్రమంలో శైవాన్ని ప్రబోధిస్తూ నాగమ్మ పల్నాట ముఖ్యస్థానం సంపాదించింది. ఈ క్రమంలో పల్నాడు రాజ్యం రెండు ముక్కలైంది.
అనుగురాజు మొదటి భార్య సంతానమైన నలగామునికి గురజాల, రెండో భార్య సంతానమైన మలిదేవాదులకు మాచర్ల రాజ్యంగా పంపకాలు జరిగాయి. ఇరురాజ్యాల మధ్య కోడిపోరుతో కక్షలు మొదలయ్యాయి. ఈ క్రమంలో మండాది వద్ద ఆలుమందలను అంతమొందించే క్రమంలో లంకన్న ఒరగటం, నలగాముని అల్లుడు అల్లరాజు మృతి పల్నాటి యుద్ధానికి దారి తీసింది. బ్రహ్మన్న దత్తపుత్రుడు కన్నమనీడు( వీర కన్నమదాసు) నేతృత్వంలో బాలచంద్రుడు తదితర 66 మంది నాయకులు ఈ పల్నాటి యుద్ధంలో అసువులు బాశారు. చివరి అంకంలో బ్రహ్మన్న, నాగమ్మలు కత్తులు దూసినప్పటికీ వైరాగ్యంతో బ్రహ్మన్న గుత్తికొండ బిలంలోకి ప్రవేశించటం, నాగమ్మ మంత్రిగా నలగామునితో రాజ్యం చేయించటంతో పల్నాటి యుద్ధం ముగిసింది.
ఆలయ విశేషాలు
900 ఏళ్లుగా పల్నాటి యుద్ధానంతరం అందులో పాల్గొన్న వీరనాయకులకు ఆరాధనోత్సవాలు నిర్వహించటం పరిపాటిగా మారింది. బ్రహ్మన్న స్థాపించిన సమసమాజాన్ని రక్షించేందుకు ఈ ఆచారాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో చెన్నకేశవస్వామి దేవాలయాలను మాచర్ల, కారంపూడిల్లో ఏర్పాటు చేసి చాపకూటిని ప్రవేశపెట్టాడు. అదే తీరున ప్రస్తుతం బ్రహ్మన్న ద్వారా ఆచారాన్ని పొందిన పిడుగు వంశీకులు చాపకూడు, వీరారాధన ద్వారా నిలుపుతున్నారు. ప్రతియేటా వీరారాధనోత్సవాలు ఘనంగా జరుగుతాయి.
ఇది చదవండి: పిల్లలకు మొబైల్ ఇస్తే ఎంత ప్రమాదమో చూడండి.. ఏకంగా తల్లిదండ్రులనే..
ఐదు రోజులూ ప్రత్యేకమే..!
ఉత్సవాల్లో మొదటిరోజు రాచగావు అనే కార్యక్రమం జరుగుతుంది. రాజు ఇచ్చే బలిని (నోటితో కొరికి మేకపోతును బలివ్వడం) రాచగావుగా పిలుస్తారు. బలిని పోతురాజుకు ఇవ్వటం ద్వారా పల్నాడు వీరారాధనోత్సవాలకు తెరలేస్తుంది. రాష్ట్రంలోని 11 జిల్లాలోని ఆచారవంతులు తమ కొణతాలు (దైవాలు) తీసుకొని కారంపూడిలోని వీర్లదేవాలయం చేరతారు.
రెండో రోజు రాయబార నిర్వహిస్తారు. అలరాజు కోడిపోరులో ఓడిన మాచర్ల రాజ్యాన్ని తిరిగి మలిదేవులకు అప్పగించాలని గురజాల రాజు నలగాముని వద్దకు సంధికి వెళతాడు. ఈ క్రమంలో నాగమ్మ ప్రభావంతో తంబళ్ళ జీయర్ ద్వారా చర్లగుడిపాడు వద్ద హత్యకు గురవుతాడు. ఆనాటి హత్యాకాండను వీరవిద్యావంతులు ఆలపిస్తుంటారు. ఈ క్రమంలో ఆచారవంతులు అవేశపూరితంగా కత్తిసేవ చేస్తుండటం నేటికి దర్శనీయమే.
మూడోరోజు మందపోరు జరుగుతుంది. కోడిపోరులో రాజ్యాన్ని కోల్పోయి అడవుల పాలైన మలిదేవాదుల వద్ద ఉన్న ఆవులను అంతమొందించేందుకు నాగమ్మ పన్నాగం ద్వారా అడవి చెంచులు దాడి చేసే క్రమంలో లంకన్న అసువులు బాస్తాడు. లంకన్నకు శంఖుతీర్ధం ఇవ్వటం ద్వారా విముక్తిని బ్రహ్మన్న ప్రసాదిస్తాడు.
నాలుగోరోజు కోడిపోరు: అలనాడు రెంటచింతల మండలంలోని పాలువాయి వద్ద జరిగిన ఇరురాజ్యాల మధ్య కోడిపోరు దృశ్యాన్ని నేటికీ చూపుతారు. మంత్రాక్షితలతో బ్రహ్మన్న పుంజును నాగమ్మ ఓడేలా చేయటం, రాజ్యం విడిచి మలిదేవాదులు అరణ్యవాసం పట్టటం ఇందులోని ముఖ్యఘట్టం.
ఐదో రోజు కల్లిపాడు: పల్నాటి యుద్ధంలో వీరనాయకులు అసువులు బాయటమే కల్లిపాడు ఉద్దేశం. ముందుగా ఏర్పాటు చేసిన తంగెడ మండలపై కొణతాలు (దైవాలు) ఒరుగుతాయి. దేవుళ్ళు ఒరిగిన మండల కోసం ప్రజలు ఎగబడతారు. దీంతో వీరారాధనోత్సవాలుముగుస్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Guntur