టెక్నాలజీ (Technology) అప్ డేట్ అవుతున్న కొద్దీ దాన్ని ఆసరాగా చేసుకొని సైబర్ నేరాలు (Cyber Crime) పెరిగిపోతున్నాయి. సైబర్ కేటుగాళ్ల మాయలో పడి చదువు రానివాళ్లే కాదు.. బాగా చదువుకున్నవాళ్లు కూడా మోసపోతున్నారు. నిజానికి ఈ సైబర్ ట్రాప్ లో వాళ్లే ఎక్కువగా పడుతున్నారు. తాజాగా ఫ్లైట్ టికెట్ పేరుతో ఏకంగా రూ.10 లక్షలు దోచేసిన ఘటన చోటు చేసుకుంది. బాధితుడికి ఎలాంటి అనుమానం రాకుండా దోచుకున్నారంటే ఎంత పకడ్బందీగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారో అర్ధమవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని గుంటూరు జిల్లా (Guntur District) మాచవరంకు చెందిన నరసింహారావు అనే వ్యక్తి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడు. ఐతే టికెట్ డౌన్ లోడ్ చేసుకునేందుకు చూడగా అందుకు సంబంధించిన మెసేజ్ గానీ, మెయిల్ గానీ రాలేదు.
దీంతో టికెట్ బుక్ చేసుకున్న వెబ్ సైట్లో ఉన్న కస్టమర్ కేర్ కాల్ సెంటర్ నెంబర్ కు ఫోన్ చేశాడు. ఓ వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయగా.. సదరు వ్యక్తి కాసేపట్లో కాల్ చేస్తానని చెప్పి పెట్టేశాడు. కొద్దిసేపటి తర్వాత ఫోన్ చేసి మీ నెంబర్ కు ఓ లింక్ పెట్టానని.. యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించాడు.
దీంతో నరసిహారావు ఆ లింక్ ఓపెన్ చేసి యాప్ డౌన్ లోడ్ చేశారు. అందులో ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్, పాస్ వర్డ్ ఎంటర్ చేశారు. కొద్దిసేపటికే అతని బ్యాంక్ ఎకౌంట్ నుంచి రూ.9.50 లక్షలు డ్రా అయ్యాయి. దీంతో మోసపోయానని తెలుసుకున్న బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే బ్యాంక్ సిబ్బందికి కాల్ చేసి ఎకౌంట్ ను ఫ్రీజ్ చేయించాడు.
గతంలో విజయవాడకు చెందిన ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని ఇదే విధంగా ఓ ప్రముఖ ట్రావెల్ వెబ్ సైట్ నుంచి అమెరికాకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారు. ఐతే కొన్ని కారణాల వల్ల ప్రయాణం రద్దవడంతో టికెట్ క్యాన్సిల్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం సదరు వెబ్ సైట్లోని కస్టమర్ కేర్ కాల్ సెంటర్ కు ఫోన్ చేయగా.. అవతలి వ్యక్తి ఓ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోని వివరాలు నమోదు చేయాలంటూ లింక్ పంపించాడు.
నిజమేనని నమ్మిన మహిళ తన మొబైల్ కు వచ్చిన లింక్ ఓపెన్ చేసి అందులో బ్యాంక్ ఎకౌంట్ ఇతర వివరాలు నమోదు చేసింది. దీంతో ఆమె ఎకౌంట్ నుంచి దాదాపు లక్షన్నర డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. వెంటనే ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు సదరు ఎకౌంట్ ను ఫ్రీజ్ చేసి కొంత నగదు రికవరీ చేయగలిగారు. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, CYBER CRIME, Guntur