కొన్నిసార్లు అడవి జంతువులు జనజీవనంలోకి వచ్చి హల్ చల్ చేస్తుంటాయి. అటవీ ప్రాంతాలకు దగ్గర్లో ఉన్న ఊళ్లలోకి ప్రవేస్తుంటాయి. ముఖ్యంగా చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం లాంటి జిల్లాల్లో ఏనుగులు నిత్యం ఊళ్లమీద దాడులు చేస్తుంటాయి. తిరుమల ఘాట్ రోడ్డులో చిరుతలు, కొండ చిలువలు, పాములు, ఎలుగుబంట్లు, జింకలు, ఇతర జంతువులు వచ్చి భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తుంటాయి. ఇక మైదాన ప్రాంతాల్లో వానరాలు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఆహారం కోసం అడవుల నుంచి వచ్చే కోతుల మందలు ఇళ్లలో ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లిపోవడం, కొన్నిసార్లు మనుషులపై దాడి చేయడం వంటివి చేస్తుంటాయి. అధికారులు వాటిని పట్టుకొని అటవీ ప్రాంతాల్లో వదిలి పెడుతుంటారు. అలా దారితప్పి వచ్చిన ఓ కొండముచ్చు నడిరోడ్డుపై వీరంగం సృష్టించింది. వాహనదారులను ముప్పతిప్పలు పెట్టింది.
వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు నగరంలో నగరంపాలెం మూడు బొమ్మల సెంటర్లో కొండముచ్చు వీరంగం వేసింది. రోడ్డుకు అడ్డుగా కూర్చున్న ఆ కొండముచ్చు ఆటోలను ఆపడం అందులో తనిఖీలు చేయడం వంటివి చేసింది. తనిఖీ చేసిన ఆటోను వదిలేయడం ఆ తర్వాత మరో ఆటో ఎక్కడం.. ఇలా ట్రాఫిక్ కానిస్టేబుల్ చేసే డ్యూటీని ఎత్తుకుంది. కొండముచ్చు చేసిన పనికి ఆ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
వాహనదారులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు దానికి వలవేశారు. ఐతే వలకు చిక్కకుండా వారిని ముప్పతిప్పలు పెట్టింది. చాలాసేపు యత్నించిన ర్వాత దానిని పట్టుకోగలిగారు.
వలలో చిక్కిన కొండముచ్చును అటవీ శాఖ అధికారులు అమీనాబాద్ అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. గతంలో గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు సమీపంలోని ఓ గ్రామంలో తిష్టవేసిన ఓ కొండముచ్చు గ్రామస్తులతో కలిసిపోయింది. కొన్నాళ్ల తర్వాత అక్కడి యువకులు ఇచ్చిన మద్యాన్ని సేవించింది. ఓ వృద్ధుడు దానిని బెదిరించినట్లు మాట్లాడటంతో అతని జట్టును లాగేసింది. దీంతో తలపై ఉన్న జుట్టుతో పాటు చర్మం కూడా ఊడిపోయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.