news18-telugu
Updated: September 30, 2020, 3:57 PM IST
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ సీఎం
రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులలో అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉండాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. వాటి నిర్మాణ విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని వైద్య, ఆరోగ్యశాఖ ఆస్పత్రులలో నాడు–నేడు పై నిర్వహించిన సమీక్షలో అధికారులకు సూచించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు అక్కడ కార్పొరేట్ లుక్ కనిపించాలని అన్నారు. చరిత్రలో నిల్చిపోయే విధంగా వాటి నిర్మాణం జరగాలని అన్నారు. మూడేళ్లలో అన్ని ఆస్పత్రుల నిర్మాణాలు పూర్తి కావాలని ఆదేశించారు. ఆ ఆస్పత్రులలో యంత్రాలు, ఏసీలు, లిఫ్ట్లు, ఎలక్ట్రికల్, నాన్ ఎలక్ట్రికల్ ఉపకరణాలు, ఫైర్ కంట్రోల్ ఎక్విప్మెంట్ వంటి అన్నింటి నిర్వహణ బాధ్యత ఏడేళ్ల పాటు అప్పగించాలని అన్నారు. తద్వారా ఏ సమస్య తలెత్తినా వెంటనే పరిష్కారం అవుతుందని అన్నారు.
ఆస్పత్రుల్లో తప్పనిసరిగా సెంట్రలైజ్డ్ ఏసీ ఉండాలన్న సీఎం జగన్.. డాక్టర్లు ఇబ్బంది పడకుండా ఉన్నప్పుడే వారు చక్కగా సేవలందించగలుగుతారని తెలిపారు. ఇందుకోసం అవసరమైతే సౌర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని అన్నారు. దాని వల్ల యూనిట్ విద్యుత్ కేవలం రూ.2.50 కే వస్తుందని తెలిపారు. దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత రాష్ట్రంలో ఆస్పత్రుల రూపురేఖలు మారబోతున్నాయని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. అందువల్ల ప్రతి ఆస్పత్రి బెస్టుగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

సీఎం జగన్
ఈ సందర్భంగా నాడు–నేడు కార్యక్రమంలో ఆస్పత్రులలో చేపడుతున్న మార్పులతో పాటు, కొత్తగా ఏర్పాటు చేస్తున్న వైద్య కళాశాలల ప్రస్తుత పరిస్థితిని అధికారులు సమావేశంలో సీఎం జగన్కు వివరించారు. పాడేరు, పిడుగురాళ్ల, మచిలీపట్నం, పులివెందులలో వైద్య కళాళాలలకు సంబంధించి భూసేకరణతో పాటు, అవసరమైన అన్ని పనులు పూర్తయ్యాయని, టెండర్ల ఖరారుకు జ్యుడీషియల్ రివ్యూకు పంపిస్తున్నామని వారు తెలిపారు. బాపట్ల, విజయనగరం, ఏలూరు, అనకాపల్లి, మార్కాపురం, మదనపల్లె, నంద్యాల మెడికల్ కాలేజీల టెండర్ల జ్యుడీషియల్ ప్రివ్యూ అక్టోబరులో జరుగుతుందని చెప్పారు. ఇక నరసాపురం, రాజమండ్రి, పెనుకొండ, అమలాపురం, ఆదోని మెడికల్ కాలేజీల టెండర్లను నవంబరు నెలలో జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపిస్తామని అధికారులు వివరించారు.
సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయగూడెం, దోర్నాలలోని ఐటీడీఏల పరిధిలో ఏర్పాటు చేయనున్న మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులకు సంబంధించి అంచనాలు సిద్ధమయ్యాయన్న అధికారులు, రంపచోడవరంలో ఏర్పాటు చేయనున్న ఆస్పత్రిని పవర్ పాయింట్ ద్వారా చూపారు. వీలైనంత త్వరగా ఆయా ఆస్పత్రుల పనులు కూడా మొదలవుతాయని అధికారులు వెల్లడించారు. పాడేరులో వైద్య కళాశాలతో పాటు, ఐటీడీఏల పరిధిలో ఏర్పాటు చేస్తున్న మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల పనులను సీఎం జగన్, అక్టోబరు 2న ప్రారంభిస్తారని అధికారులు వివరించారు.
Published by:
Kishore Akkaladevi
First published:
September 30, 2020, 3:54 PM IST