వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (YS Viveka Murder Case) లో అధికార వైసీపీ (YSRCP), ప్రతిపక్ష టీడీపీ (TDP) ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. క్రైమ్ స్టోరీ కాస్తా.. పొలిటకల్ టర్న్ తీసుకోవడంతో ప్రతి రోజు సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. వివేకా హత్య కేసులో సీఎం జగన్, ఎంపీ అవినాష్ రెడ్డిపై వస్తున్న ఆరోపణలకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. వివేకా మరణంపై చంద్రబాబు కుట్రపూరిత వ్యూహం అమలు చేస్తున్నారని.. సీబీఐ, ఎల్లో మీడియాతో కలిసి బురద చల్లుతున్నారని సజ్జల ఆరోపించారు. ఈ కేసులోకి నేరుగా శంకర్రెడ్డిని, ఆ తర్వాత అవినాష్రెడ్డిని.. చివరగా జగన్గారిని లాగాలన్న ఉద్దేశంతో పని చేస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
సునీతమ్మ చంద్రబాబు చేతిలో పావులా మారారని.. ఇప్పుడు ఆయనతో కలిసి పాత్రధారులూ అయ్యారని సజ్జల ఆరోపించారు. అందుకే సునీతమ్మ, ఆమె భర్త ఒకేలా మాట్లాడుతున్నారన్న సజ్జల.. జగన్గారిని రాజకీయంగా ఎదుర్కోలేకనే ఈ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసు దర్యాప్తుపై తాము అడిగిన 5 ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదని సజ్జల విమర్శించారు.
సీబీఐ దర్యాప్తు ప్రారంభంలో రెండు మూడు నెలలు సవ్యంగా సాగిందని.. ఆ తర్వాత పూర్తిగా పక్కదారి పట్టిందని సజ్జల విమర్శించారు. సాక్ష్యులు స్పష్టంగా చెప్పినట్లుగా లేకపోయినా.. మీడియాలో వస్తున్న వార్తలు వాటిపై టీడీపీ స్పందన. ఆ తర్వాత ట్వీట్లు ఒక వ్యూహం ప్రకారమే జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఒక హత్య గురించి ఒక క్రియేటివ్ ఆర్టిస్ట్ తయారు చేసినట్లు సీబీఐ కూడా మారడం, ఇవన్నీ తయారు చేయడం చూస్తున్నామని సజ్జల విమర్శించారు. ఈ ఆరోపణలపై జగన్ స్పందించలేక కాదని.. కుటుంబం గురించి మాట్లాడటం ఇష్టం లేకనే సైలెంట్ గా ఉన్నారని వివవరించారు.
సీఎం జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేక, కేసును ఆయనవైపు మళ్లిస్తూ, వివేకానందరెడ్డి కూతురు, అల్లుడ్ని తమవైపు తిప్పుకున్నారని సజ్జల ఆరోపించారు. నిజానికి వారికి ఆ హత్య జరిగినప్పటి నుంచే ఆ సంబంధాలు కొనసాగుతున్నాయా? అని అనమానం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వివేకానందరెడ్డి కుమార్తె అని ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోందని.., ఆమె కావాలంటే ఆ పార్టీలోకి వెళ్లొచ్చు... కానీ దాని కోసం ఇలా కుట్రలు చేయడం, ఆరోపణలు చేయడం సరికాదని సజ్జల హితవుపలికారు.
జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేనని నిర్ధారణకు వచ్చిన చంద్రబాబు, కచ్చితంగా ఇలాంటి మార్గాలే వెతుక్కుంటారని సజ్జల ఆరోపించారు. వివేకా హత్య వెనుక జగన్ ఉన్నారనే ముద్రవేస్తున్నారన్నారు. సీఆర్పీసీ–161 స్టేట్మెంటు చూసిన సునీతమ్మ, రాజశేఖర్రెడ్డి ఖండించాలి.., కానీ వారు ఆ పని చేయలేదు కాబట్టి, వారు ఆ విధంగా వాంగ్మూలం ఇచ్చారని మేము భావించాల్సి వస్తుందన్నారు. “హత్య తర్వాత జరిగిన విషయాలు చెప్పింది ఎవరు? సునీతమ్మనే కదా? ఎందుకంటే ఏ విషయమైనా వారి ద్వారానే తెలియాలి కదా? ఎందుకంటే జగన్గారు ఆమెకు అన్న. విపక్షనేత. ఇంటికి పెద్ద. కాబట్టి అన్ని విషయాలు చెప్పకుండా ఉంటారా?” అని సజ్జల ప్రశ్నించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.