పాతరోజుల్లో పెళ్లిళ్లంటే (Marriages) ఊర్లోనే అక్కడక్కడే చేసుకుండేవాళ్లు.. తర్వాత కాస్త ఊరి దాటి బయట సంబంధం.. ఆ తర్వాత జిల్లాలు (Districts), రాష్ట్రాలు (States) దాటేశారు. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే ఖండాతర వివాహాలు. అమెరికా (America) అమ్మాయి.. ఆంధ్రా (Andhra) అబ్బాయి, పారీస్ పోరీ.. తెలంగాణ పోరడు ఇప్పుడు ఇదే నడుస్తుంది. కానీ ఇప్పుడు చూసే పెళ్లి మూడు దేశాల ముచ్చటైనది. అమ్మాయిది జర్మనీ.. అబ్బాయిది ఆంధ్రా.. పెళ్లి జరిగిందేమో అమెరికాలో..!
విశాఖపట్నానికి చెందిన విశ్రాంత అధికారి, విశాఖ కళాసాగర్ వ్యవస్థాపక అధ్యక్షుడు వానపల్లి శ్రీమన్నారాయణ ఏకైక కుమారుడు శశాంక్ జర్మనీలో ఉంటున్నాడు. జర్మనీకే చెందిన లిండా ముల్లర్ అనే యువతితో శశాంక్ స్నేహం కాస్తా.. ప్రేమగా చిగురించింది. వారి ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలియగానే పెద్దలు కూడా అంగీకరించడంతో పెళ్లికి అంతా సిద్ధమయ్యారు. అయితే వివాహాన్ని అటు వైజాగ్, ఇటు జర్మనీ కాకుండా అమెరికాలో ప్లాన్ చేశారు.
అమెరికాలోని ప్రకృతి సోయగాల నడుమ సంప్రదాయ పద్ధతిలో బంధుమిత్రుల నడుమ హిందూ సంప్రదాయంలో పెళ్లి జరిగింది. వేద మంత్రాల నడుమ వరుడు శశాంక్.. వధువు ముల్లర్ మెడలో మూడు మూడులు, ఏడు అడుగులు వేసి ఒక్కటయ్యారు. జర్మనీకి చెందిన అమ్మాయి హిందూ సంప్రదాయ పద్ధతిలోనే వివాహం చేసుకోవడానికి అంగీకరించడమే ఇక్కడ హైలెట్గా నిలిచింది.
అయితే, ఇలాంటి వివాహాలు ఇంతకు ముందూ జరిగాయి. రెండేళ్ల కిందట వివాహం చేసుకున్న అమెరికా అమ్మాయి, వైజాగ్ అబ్బాయి స్టోరీ కూడా ఓసారి చదివేద్దాం రండి. విశాఖ అబ్బాయితో పెళ్లయిన తర్వాత అమెరికా అమ్మాయి జీవితం పూర్తిగా మారిపోయింది. భారతదేశ సంప్రదాయాలతో పాటు తెలుగు పచ్చళ్ల నుంచి తెలుగు సీరియళ్ల వరకూ అన్నింటికీ అడిక్ట్ అయిపోయింది ఆ మహిళ.
వైజాగ్కు చెందిన అభిషేక్ శామ్యూల్, అమెరికాకు చెందిన హాన్నాను 2020లో వివాహం చేసుకున్నాడు. ఏడాది తర్వాత హాన్నా పూర్తిగా మన భారతీయ సంస్కృతికి అలవాటు పడటమే కాకుండా.. తెలుగు రిలేషన్స్ గురించి కూడా చక్కగా చెబుతూ ఆ మధ్య ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ముక్కు పుడక దగ్గర నుంచి ముత్యాల ల్లాంటి తెలుగు అక్షరాల వరకు తెలుగుదనం ఉట్టిపడేలా మారిపోయింది.
2017లో జరిగిన ప్రేమ పెళ్లి వీటన్నింటికీ చాలా భిన్నమైనది. అమెరికాలో ఉన్నత విద్య చదివి బ్యాంక్ ఉద్యోగం చేస్తున్న ఒక అమ్మాయి.. గుజరాత్లో ఓ రైతుతో ప్రేమలో పడి వివాహం చేసేసుకుంది. గుజరాత్కు చెందిన ఆకాశ్ పటేల్ 12వ తరగతి వరకు చదివి రైతుగా స్థిరపడ్డాడు. అప్పట్లో ఫేస్బుక్ ద్వారా అమెరికాలోని జెస్సికా కమాకో బుస్టాప్ అనే యువతితో ఆకాశ్కి పరిచయం ఏర్పడింది. అయితే, ఆకాశ్ని కలిసేందుకు ఇండియాకి వచ్చిన జెస్సికా ఇక్కడ ఆచారవ్యవహారాలు చూసి ఆకాశ్ని వెంటనే పెళ్లాడింది. ఇలా ఖండాంతర వివాహాలు ఇప్పుడు చాలా రొటీన్గా మారిపోయాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, Andhra, Germany, Love marriage