GEOLOGICAL SURVEY OF INDIA IDENTIFIED SEA CORALS IN VISAKHAPATNAM COASTAL AREA FULL DETAILS HERE PRN VSP
AP News: సాగరగర్భంలో అందమైన ప్రపంచం.. ఏపీ తీరంలో అరుదైన పగడపు దిబ్బలు..
ప్రతీకాత్మకచిత్రం (Photo Credit: Facebook)
Visakhapatnam: సాగర గర్భంలో అందమైన ప్రపంచం దాగి ఉంటుంది. లక్షలాది జీవిరాశులతో పాటు అబ్బురపరిచే మొక్కలు, పగడపు దిబ్బలు ఉంటాయి. భూమ్మీద ఎక్కడా కనిపించని అత్యంత అందంగా ఉంటుంది సాగర గర్భం.
సాగర గర్భంలో అందమైన ప్రపంచం దాగి ఉంటుంది. లక్షలాది జీవిరాశులతో పాటు అబ్బురపరిచే మొక్కలు, పగడపు దిబ్బలు ఉంటాయి. భూమ్మీద ఎక్కడా కనిపించని అత్యంత అందంగా ఉంటుంది సాగర గర్భం. ఐతే ఇవన్నీ సినిమాల్లోనో, లేక విదేశాల్లోని సముద్ర గర్భాల్లోనో మనకు కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోనూ ఎక్కడా లేని అత్యంత అరుదైన, విభిన్నమైన పగడపు దిబ్బలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సుదీర్ఘమైన సముద్ర తీరమున్న ఏపీలో చాలా చోట్ల పగడపు దిబ్బలున్నాయట. ముఖ్యంగా అందమైన విశాఖపట్నం (Visakhapatnam) తీరానికి అతిదగ్గర్లోనే వీటిని గుర్తించారు. ఏపీ కోస్తా తీరంలో పగడపు దిబ్బలుండవనే మాట తప్పని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (Geological Survey of India) నిరూపించింది.
ఏపీ తీరంలోని ఒకే ప్రాంతంలో వివిధ రకాల కోరల్స్ జాడను శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాదు ఆ పగడపు దిబ్బలను మరోచోటుకి తరలించి అభివృద్ధి చేయడం సూడా సాధ్యమని తెలిపారు. ఏపీలోని విశాఖపట్నం జిల్లాలోని పూడిమడక తీరం నుంచి విజయనగరం జిల్లా చింతపల్లి తీరం వరకు జరిపిన సర్వేలో విభిన్న జాతుల కోరల్స్ జాడ లభించింది. ఏపీ కోస్తా తీరంలో దాదాపు మూడేళ్ల పాటు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధనలు జరిపింది.
శాస్త్రవేత్తలు పూడిమడక, రిషికొండ, భీమిలి, యారాడ, కైలాసగిరి, ఆర్కే బీచ్, మంగమూరి పేట, సాగర్ నగర్, తెన్నేటి పార్క్, చింతపల్లి బీచ్ ప్రాంతాల్లో పరిశోధనలు జరిపారు. ఒక్కో ప్రాంతంలో నాలుగు భిన్నమైన ప్రాంతాలను సర్వే పాయింట్లుగా గుర్తించి.. 30 మీటర్ల లోతులో అంటే దాదాపు వంద అడుగుల లోతులో సర్వే చేశారు. విశాఖలోని స్కూబా డైవింగ్ సంస్థ అయిన లివిన్ అడ్వెంచర్స్ సహకారంతో నలుగురు శాస్త్రవేత్తలు చేపట్టిన సర్వేల్లో పూడిమడక వద్ద పగడపు దిబ్బల ఆఛూకీ లభ్యమైంది.
ముఖ్యంగా డిస్కోసోమా, లోబాక్టిస్, హెక్సకోరిలియా, ఆక్టోటోరిలియా, పపోనాఎస్పీ, స్కెలరాక్టినియా కోరల్స్, లిథోపిలాన్ ఎస్పీ, మోంటీపోరా ఎస్పీ, పోరిటెస్ ఎస్పీ వంటి కోరల్స్ జాడ లభ్యమైంది. ఐతే వీటిలో కొంతభాగం తీసి మరోచోట పెంచే రకాలు అరదుగా ఉంటాయని.. అలాంటి కోరల్స్ పూడిమడకలో ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. ఇందులో మరో విశేషమేటంటే.. ఈ కోరల్స్ మందుల తయారీకి కూడా ఉపయోగపడతాయని వెల్లడించారు.
పరిశోధనల్లో భాగంగా విశాఖ తీరంలో 1,597 మొలస్కా జాతులు, 182 సినిడారియన్, 161 స్పాంజ్, 133 రకాల చేపలు, 106 క్రస్టేసియన్లు, 12 అసిడియన్లు, 3 ఫ్లాట్ వార్మ్లతో పాటు.. అన్నెలిడ్ వంటి జీవరాశుల నమూనాలను సేకరించారు. ఈ పగడపు దిబ్బలు మత్స్య సంపద వృద్ధి చెందడానికి ఎంతగానో తోడ్పడతాయని సముద్ర పరిశోధకులు బలరాం తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.