Big Fish: వారంతా మత్స్యకారులు. రోజంతా కష్టపడి చేపలు పడితేనే వారికి పూట గడుస్తుంది. సముద్రంలోకి చేపల వేటకు వెళ్లే జాలర్లు.. ఒక్కోసారి వారం రోజులైనా ఒడ్డుకు వచ్చే పరిస్థితి ఉండదు. దండిగా చేపలు వలకు చిక్కితేనే వారు తమ కుటుంబాలను నెట్టుకువస్తారు. సముద్రంలోకి వెళ్లే ముందు గంపెడాశతో వెళ్తారు. ఒక్కోరోజు వారి ఆశల అంచనాలు అందుకుంటారు. మరో రోజూ గంపెడు కాదు కదా.. గుప్పేడు చేపలు దొరికే పరిస్థితి ఉండదు. అయితే మత్స్యకారులకు ఇది నిత్య పోరాటమే. ఆ తరహాలోనే సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఊహించని అనుభవం ఎదురయ్యింది. ఎందుకంటే..? సాధారణంగా సముద్రంలో సాంప్రదాయ మత్స్యకారులు పట్టే చేప ఎన్ని కిలోలు ఉంటుంది..? పది.. ఇరవై.. యాభై.. మహా అయితే వంద కిలోలు.. అంతేనా..? కానీ విశాఖ జిల్లాలో వేటకు వెళ్లిన ఓ మత్స్యకారులకు… ఓ భారీ టేకు చెప చిక్కింది. దాని బరువెంతో తెలిస్తే షాక్ అవుతారు..?
మత్స్యకారుల వలకు చిక్కిన ఆ చేప బరువు అక్షరాలా వెయ్యి కిలోలు..!. వివరాల్లోకి వెళ్తే.. విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకకు చెందిన అయిదుగురు మత్స్యకారులు వేటకు వెళ్లారు. సాంప్రదాయ పడవలో సముద్రంలో వేట చేస్తున్నారు. సముద్రంలో కొంచెం దూరం వెళ్ళాక.. వల ఒక్కసారిగా బరువు ఎక్కినట్టు అనిపించింది. దీంతో ఎదో ఓ భారీ చేప తగిలినట్టు భావించి.. పంట పండింది అనుకున్నారు. కానీ దగ్గరకు వెళ్లి చూసే సరికి అది భారీ టేకు చేప..! వారు ఊహకందని రీతిలో భారీ కాయంతో బరువు వెయ్యి కిలోల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో దాన్ని పడవలో ఎక్కించేందుకు చెమటోడ్చారు. కానీ ఫలితం దక్కలేదు. ఎంత 'ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరకు చేసేదిలేక ఆ చేపకు పెద్ద తాడు కట్టి దాన్ని పడవకు చుట్టి ఒడ్డుకు చేర్చారు. ఒడ్డు నుంచి బయటకు తేవాలన్నా తీవ్రంగా శ్రామించ్చాల్సి వచ్చింది. స్థానిక మత్స్యకారుల సాయంతో ఆ భారీ టేకు చేపను బయటకు లాగారు. మున్నెన్నడూ లేని విధంగా ఎంత భారీస్థాయిలో రేపు చేప చిక్కడంతో మత్స్యకారులు అంతా వింతగా చూశారు.
Bahubali Fish || విశాఖ మత్స్యకారుల పంట పండించిన టేకు చేప|| 1000 కిలోల బర... https://t.co/PYCfVi31Vi via @YouTube #fishinglife #FishUponTheSky @USFWS
— nagesh paina (@PainaNagesh) March 10, 2022
ఈ విషయం ఆ నోటా ఈ నోటా బయటకు సోకడంతో.. దాన్ని చూసేందుకు పరిసర గ్రామాల ప్రజలు భారీగా తరలి వచ్చారు. దీన్ని విక్రయిస్తే సుమారు 40 నుంచి 50 వేల రూపాయల వరకు వస్తుందని చెబుతున్నారు. భారీ సైజు ఉండే టేకు చేపలు సముద్రంలోనే పెరుగుతుంటాయి. సముద్ర గర్భంలో ఉండే టేకు చేప బయటికి రావడం.. అది వలకు సచిక్కడంతో మత్స్యకారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ అరుదైన చేపను చూసేందుకు జనం ఎగబడ్డారు. గతంలో కూడా 1150 కిలోల భారీ టేకు చేప వారి వలకు చిక్కింది. ఈ ఘటన కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నానికి చెందిన మత్స్యకారులకు ఎదురయ్యింది. రోజువారీ లాగే చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు అదృష్టం టేకు రూపంలో వలకు చిక్కింది. పడవ నుంచి ప్రొక్లెయిన్ సాయంతో బయటకు తీసుకొచ్చారు. మార్కెట్లో ఈ చేపను 37 వేల రూపాయలకు విక్రయించారు. ఇలాంటి టేకు చేపలు అరుదుగా దొరుకుతుంటాయని అధికారులు పేర్కొన్నారు. ఏదిఏమైనా ఈ టేకు చేపతో మత్స్యకారుల పంట పండిందనే చెప్పాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Fish, Fishermen, Vizag