విశాఖపట్నం గాజువాకలో ఉన్న స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. స్టీల్ ప్లాంట్ ఎస్ ఎమ్ ఎస్ -2 లో లాడిల్ తెగిపోయింది. సుమారు కోటి రూపాయల ఉక్కు ద్రావణం కిందపడిపోయింది. దీంతో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులకు కూడా గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించారు. స్టీల్ ఫ్యాక్టరీ ఉన్నతాధికారులు కూడా వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అగ్నిప్రమాదంతో పనులు నిలిచిపోయాయి. బాధితుల ప్రాణాలకు ప్రమాదం లేదని స్టీల్ ప్లాంట్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఇటీవల వరుసగా విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదాలు జరుగుతున్నాయని, భద్రతా పరంగా మరికొన్ని పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ట్రేడ్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనలో మొత్తం ముగ్గురు కార్మికులు గాయపడ్డారు. సాయంత్రం 6.30 గంటల నుంచి 7 గంటల మధ్య ఈ ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు. ఉక్కు ద్రావణాన్ని తీసుకెళ్తున్న లాడెల్ హుక్స్ తెగిపోయాయి. సుమారు 100 టన్నుల వేడి వేడి ఉక్కు ద్రావణం 30, 40 అడుగుల ఎత్తు నుంచి కింద పడింది. ఆ వేడి వేడి ఉక్కు ద్రావణం చుక్కలు పడడంతో కొందరు కార్మికులు గాయపడ్డారు.
సహజంగా లాడెల్ ఆపరేట్ చేస్తున్నప్పుడూ అక్కడ ఎవరూ ఉండరు. ఇక్కడ అత్యధికంగా మెషినరీ ఆధారంగానే పనులు చేస్తారు. అగ్నిప్రమాదం జరిగిన కొన్ని నిమిషాల్లోనే ఘటన ప్రాంతానికి అగ్నిమాపక వాహనాలు వచ్చాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేశారు. కింద పడిన ఉక్కు ద్రావణాన్ని మళ్లీ వినియోగించుకోవచ్చని స్టీల్ ప్లాంట్ అధికారులు చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Visakhapatnam