అవసరం అప్పు చేయిస్తుంది. అప్పు ఆయువు తీస్తుంది. కుటుంబ ఖర్చులకో, కూతురు పెళ్లికో, ఆస్పత్రి ఖర్చలకో చేసిన అప్పులు జనాల మెడకు చుట్టుకుంటున్నాయి. అల్ప ఆదాయం.. అందనంత ఎత్తులో అప్పులు. దానికి తోడు వడ్డీ భారం వెరసి ఓ కుటుంబాన్ని బలితీసుకున్నాయి. చేతికంది వచ్చిన కొడుకుతో కలిసి ఓ జంట ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కృష్ణా జిల్లా (Krishna District) పెడన పట్టణంలోని 17వ వార్డుకు చెందిన కాశిన పద్మనాభరావు చేనేత వృత్తి సాగిస్తున్నారు. ఆయనకు భార్య లీలావతి, కుమారుడు నాగేంద్రం ఉన్నారు. ఇటీవలే కుమార్తెకు వివాహం జరిపించారు. ఐతే కుటుంబ అవసరాల నిమిత్తం పద్మనాభరావు పట్టణానికి చెందిన మెట్ల విఠల్ లోకేష్ అనే వ్యక్తి వద్ద రూ.2లక్షలు అప్పు చేశాడు.
అది వడ్డీతో సహా మొత్తం రూ.4.60 లక్షలైంది. ఇటీవల తన అప్పు చెల్లించాల్సిందిగా పద్మనాభం కుటుంబంపై ఒత్తిడి తెచ్చిన విఠల్.. మొత్తం అప్పులో రూ.1.86 లక్షలను ఈ ఏడాది మార్చి 1న చెల్లించాలని షరతు విధిస్తూ నోటరీ చేయించారు. ఐతే గడువులోగా అప్పు చెల్లించకుంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని నోటరీలో రాయించారు. దీంతో మార్చిలోగా అప్పు తీర్చడం సాధ్యం కాదని భావించిన పద్మనాభం.., భార్య, కుమారుడితో కలిసి ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వాస్పస్పత్రికి తరలించారు. అధిక వడ్డీలకు అప్పులిచ్చి ఓ కుటుంబం ఆత్మహత్యకు కారణమైన వడ్డీ వ్యాపారులు మెట్ల విఠల్ లోకేష్, జీవన్ ప్రసాద్ పై కేసు నమోదు చేశారు.
కాగా పెడనలో చేనేత కుటుంబం ఆత్మహత్యపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. వైసీపీ పాలనలో సంక్షేమ ఫలాలు అందకపోవడం వలనే నేతన్నల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఆయన ఆరోపించారు. చేనేత రంగం కుదేలయ్యేలా జగన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు, రద్దు చేసిన సంక్షేమ కార్యక్రమాల వలన అప్పుల ఊబిలో చిక్కుకొని కుటుంబాలతో కలిసి నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందకపోవడం, అప్పుల భారంతోనే పెడనలో కాచన పద్మనాభం కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన బాధాకరమని లోకేష్ అన్నారు.
వైసిపి పాలనలో సంక్షేమ ఫలాలు అందకపోవడం వలనే నేతన్నల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. చేనేత రంగం కుదేలయ్యేలా జగన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు, రద్దు చేసిన సంక్షేమ కార్యక్రమాల వలన అప్పుల ఊబిలో చిక్కుకొని కుటుంబాలతో కలిసి నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. pic.twitter.com/U5oP151WYX
— Lokesh Nara (@naralokesh) February 1, 2022
టిడిపి హయాంలో నేతన్నకు ఏడాదికి సుమారు 50 వేలకు పైగా వచ్చే ప్రోత్సాహకాలను, రాయితీలను ఆపేసి... రూ.24 వేలను చేతిలోపెట్టి సరిపెట్టుకోమంటున్నారని లోకేష్ మండిపడ్డారు. అది కూడా సొంత మగ్గం ఉన్న వారికే వర్తించేలా నిబంధనలు పెట్టారని.., ఆప్కో కొనుగోళ్లు ఆగిపోయాయని విమర్శించారు. మజూరీ, రాయితీలు ఆగిపోయాయన్న లోకేష్.., సొంతంగా మగ్గం ఏర్పాటుకు సాయం లేదని పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.