ఆంధ్రప్రదేశ్(Andra Pradesh) ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కొత్త జిల్లాల అంశం (AP New Districts Issue) తీవ్ర చర్చనీయాంశమవుతోంది. జిల్లా కేంద్రాలు, పరుధులు, పేర్లు, ఇతర అంశాలపై రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ఆయా జిల్లాలకు చెందిన ప్రజలు అభ్యంతరాలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళనలు, దీక్షలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే విజయవాడ జిల్లా, హిందూపురం జిల్లాలపై రాజకీయ రగడ తారాస్థాయికి చేరుకోగా.. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ జిల్లా కూడా చర్చనీయాంశమవుతోంది. నరసాపురంను జిల్లా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం భీమవరంను జిల్లా కేంద్రం చేస్తున్నట్లు పేర్కొంది. ఇప్పుడు దీనిపై నర్సాపురంలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. నరసాపురం జిల్లా నరసాపురంనే కేంద్రం ప్రకటించాలని స్థానిక నేతలు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ జరుగుతున్న ఆందోళన కార్యక్రమంలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుపై మండిపడ్డారు. నరసాపురం జిల్లా కేంద్రం తరలిపోవడానికి ఎమ్మెల్యేనే కారణమని.. ఆయన వైఫల్యం వల్లే నరసాపురంకు అన్యాయం జరిగిందన్నారు. గత ఎన్నికల్లో ప్రసాదరాజును గెలిపించి తప్పుచేశానంటూ.. తన చెప్పుతో తానే కొట్టుకున్నారు. పక్కనున్నవాళ్లు చెప్పును లాక్కొవడంతో పరిస్థితి సద్దుమణింగింది. జిల్లా కేంద్రం విషయంలో పరిస్థితుల్లోనే తగ్గేది లేదని.. డిమాండ్ ను సాధించేవరకు రాజీలేని పోరాటం చేస్తామని కొత్తపల్లి సుబ్బారాయుడు స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంకా ప్రతిఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇదిలా ఉంటే జిల్లా విభజనలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాని ఏలూరు పార్లమెంట్, నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా రెండుగా విభజించారు. ఐతే నరసాపురం జిల్లాకు భీమవరంను కేంద్రంగా పేర్కొన్నారు. స్థానికులు మాత్రం నియోజకవర్గ కేంద్రమైన నరసాపురంనే జిల్లా హెడ్ క్వార్టర్స్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికే సత్యసాయి జిల్లా కేంద్రంగా పుట్టపర్తికి బదులు.. హిందూపురాన్ని ప్రకటించాలని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం ఆయన మౌనదీక్ష కూడా చేపట్టారు. అలాగే విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు బదులు దివంగత వంగవీటి రంగా పేరు పెట్టాలన్న డమాండ్లు ఊపందుకుంటున్నాయి. తాజాగా నరసాపురం వివాదం సీరియస్ ఇష్యూగా మారడం మరింత చర్చనీయాంశమైంది.
ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలపై అభ్యంతరాలు స్వీకరణకు ఇచ్చిన గడువు గురువారంతో ముగియనుంది. ఇప్పటికే జిల్లాల వారీగా ఉన్నతస్థాయి కమిటీ వివిధ అంశాలపై చర్చిస్తోంది. అభ్యంతరాలు, జిల్లా కార్యాలయాలు, ఉద్యోగుల విభజన తదితర అంశాలపై కసరత్తు చేస్తోంది. ఏప్రిల్ 2వ తేదీ నాటికి ఎట్టిపరిస్థితుల్లో కొత్త జిల్లాల నుంచే పాలన జరగాలని సీఎం జగన్ భావిస్తుండటంతో.. అభ్యంతరాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP new districts, West Godavari, Ysrcp