P Ramesh, News18, Kakinada
విద్య, వైద్యం, ఆరోగ్యం, సాగునీరు, తాగునీరు ఇలా ఏ ప్రభుత్వం వచ్చినా వీటిపైనే దృష్టి పెడుతుంది. ఎందుకంటే మనిషి జీవన విధానంలో ఇవి భాగాలు. ముఖ్యంగా అందరికీ కావాల్సింది తాగునీరు (Drinking Water). అయితే ఇప్పుడు ఇదే తాగునీరు కోట్ల రూపాయలు కురిపిస్తోంది. ప్రభుత్వ విధానాల లోపమో, లేక ప్రైవేటు వ్యక్తుల దోపిడీయో తెలియదు కానీ, వాటర్ వ్యాపారం ఇప్పుడు మూడు పువ్వులు, ఆరు కాయలుగా మారీ లాభాలు కురిపిస్తోంది. తాగునీటిపై ఎన్ని పథకాలు పెట్టినా, ప్రభుత్వం అందించే తాగునీటిని వదిలి, ప్రైవేటు తాగునీటిపైనే ఆధారపడుతున్నారు. ఇందుకు కారణం శుభ్రమైన నీరు తాగి ఆరోగ్యం కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో ఇదంతా జరుగుతుంది.
కానీ ఇదే అదనుగా చేసుకుంటున్న కేటుగాళ్లు అక్రమ మంచినీటి వ్యాపారానికి తెరలేపారు . 3 నుండి 4 లక్షల రూపాయాలు పెట్టుబడి పెట్టి మాములుగా బావిలో దొరికే నీటిని, కొళాయిల నుండి వచ్చే నీటిని పట్టేసి యదేచ్ఛగా వాటిని విక్రయించడం ఇప్పుడు కాకినాడ జిల్లాలో చర్చనీయాంశమైంది. విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ డా.ఎస్.బి. బాగ్చి ఆదేశాలతో ఎస్.పి. పి.వి.రవి కుమార్ ఆధ్వర్యంలో విజిలెన్స్, రెవెన్యూ, ఫుడ్ సేఫ్టీ , లీగల్ మెట్రాలజీ అధికారులు సంయుక్తంగా కాకినాడ జిల్లా (Kakinada District) లోని కిర్లంపూడి మండలములోని గెద్దనాపల్లి గ్రామంలో శ్రీ లలిత వాటర్ ప్లాంట్ ను ఆకస్మికముగా తనిఖీ చేశారు. వాటర్ ప్లాంట్ లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రమాణాల ప్రకారం త్రాగునీటిని సురక్షితముగా ప్యాకింగ్ చేస్తున్నారనే దానిపై పరిశీలించారు.
ఇదే వాటర్ ప్లాంట్ కు ప్యాకింగ్ లైసెన్స్ లేకపోవుట, వాటర్ ప్యాకెట్స్ పై మెండిటరీ డిక్లరేషన్ లేకపోవడాన్ని గుర్తించిన లీగల్ మెట్రాలజీ రెండు కేసులు నమోదు చేశారు. వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన ఎటువంటి లైసెన్స్ లు పొందనందున తహశీల్దార్ ఆదేశాలతో వాటర్ ప్లాంట్ను సీజ్ చేశారు. దీనిపై రాజమండ్రి విజిలెన్స్ ఎస్పీ రవికుమార్ మాట్లాడుతూ వాటర్ ప్లాంట్స్ నాణ్యతా ప్రమాణములు పాటించుట లేదని ఫిర్యాదులు రావటముతో రాష్ట్ర విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ డీజీ బాగ్చి ఆదేశాలతో మూడు జిల్లాలలోని కొన్ని వాటర్ ప్లాంట్స్ ను ఆకస్మికముగా తనిఖీ చేయడం జరిగిందన్నారు.
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రమాణాల మేరకు మినరల్ వాటర్ తయారీ లేకపోవుట, ప్యాకింగ్ పర్మిషన్ లేకపోవుట, శుద్ధి చేసిన త్రాగునీటిని పరీక్షించకపోవుట,వాటర్ ప్లాంట్స్ కు అవసరమగు అనుమతులు సంబందిత శాఖల అనుమతిలేకపోవడాన్ని గుర్తించామన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించని త్రాగు నీటి వాటర్ ప్లాంట్స్ వల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాటర్ ప్లాంట్ యజమానులు అనుమతుల విషయంలో పూర్తిగా నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు.
యథేచ్ఛగా అక్రమాలు
తాగునీటి వ్యవహారంలో యదేచ్ఛగా అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఉపాధి కోసం ఇదొక వ్యాపారంగా సాగిస్తున్నారు. లోకల్ గా అక్కడ ఉన్న నాయకులు సపోర్ట్ చేయడంతో అధికారులు కూడా వత్తాసు పాడుతున్నారు. దీంతో యదావిధిగా వ్యాపారం చేస్తున్నారు. 20 లీటర్ల నీరు. 20 రూపాయాల చొప్పన ప్రత్యేకంగా ప్యాకింగ్ చేసి అమ్మేస్తున్నారు. ఇలా సాధారణంగా దొరికే నీటిని అమ్మకం చేయడంతో ప్రజల ఆరోగ్యంపై ఈప్రభావం పడుతుంది. విజిలెన్స్ అధికారులు ఇప్పుడు చేస్తున్న రైడ్స్తో ఈసారైనా మార్పు వస్తుందో లేదో వేచి చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East Godavari Dist, Kakinada, Local News