P Ramesh, News18, Kakinada
తెలుగు రాష్ట్రాల్లో రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన కాకినాడ జిల్లా (Kakinada District) అనపర్తి నియోజకవర్గంలో పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో వేంచేసి యున్న కోదండరామచంద్రమూర్తి ఆలయంలో గురువారం శ్రీరామ నవమి ఉత్సవాలు నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఆద్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. 1889లో ఇక్కడ స్వామి వారు స్వయంభుగా వెలువగా భక్తులు శ్రీ సీతా మహాలక్ష్మి శ్రీ రామచంద్రమూర్తి అను పేర్లతో కొలలను ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. అప్పటి నుండి స్వామివారు భక్తుల పూజలను కొలల రూపంలోనే అందుకుంటూ వస్తున్నారు. గ్రామానికి చెందిన ద్వారంపూడి సుబ్బిరెడ్డి, రామిరెడ్డి సోదరులు స్వామివారికి ఆలయాన్ని నిర్మించాలని సంకల్పం చేశారు. ఆలయ నిర్మాణంతో బాటు తూర్పున తొమ్మిది అంతస్థుల గోపురాన్ని 160 అడుగుల ఎత్తులో నిర్మాణం పూర్తి చేశారు.
తరువాత క్రమంలో వాస్తు ప్రకారం పడమరన ఎత్తు ఉండాలని 1956లో పశ్చిమాన 200 అడుగుల ఎత్తులో 11 అంతుస్తుల గోపురాలను నిర్మించారు. ఈ గోపురాల పై ఆనాటి రామాయణం, భాగవతాలకు చెందిన అంశాలను శిల్పులు కండ్లకు కట్టినట్టుగా రూపొందించారు. గోపురాలపై ఉన్న శిల్ప కళా సంపదను తిలకించేందుకు రెండు కనులు చాలవని భక్తులు పేర్కొనడం విశేషం. నాటి నుండి నేటి వరకు ప్రతి యేటా స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తూ స్వామిని కొలుస్తున్నారు.
కాల క్రమంలో నిర్మించిన అద్దాల మందిరం మాయా ప్రపంచాన్ని తలపిస్తుంది. ఇక్కడ అద్దాల మందిరంలో ప్రవేశించిన భక్తులు వింత అనుభూతికకి లోనవుతారు. ఐదు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. స్వామివారి కల్యాణం తిలకించేందుకు ఈ సంవత్సరం అధిక సంఖ్యలో స్వామివారి కల్యాణం తిలకించేందుకు భక్తులు హాజరుకానున్నారు. ఆ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
కళ్యాణం సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రభుత్వం తరపున కాకినాడ జిల్లా కలెక్టర్ కార్తీక శుక్ల, అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి దంపతులు స్వామివారికి నూతన పట్టు వస్త్రాలనుసమర్పించనున్నారు. స్వామి వారి కళ్యాణంలో ఉపయోగించేందుకు తలంబ్రాలను శాస్త్ర యుక్తంగా గ్రామానికి చెందిన ద్వారంపూడి యువ రాజా రెడ్డి గత 13 సంవత్సరాలుగా స్వయంగా ఉదయం సాయంత్రం పూజ అనంతరం చేతులతో ఒకేసారి 8 బియ్యం గింజల పై స్వహస్తాలతో శ్రీరామ, శ్రీరామ అని రాశి స్వామివారికి సమర్పించడం గత 14 సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది.
ఈ సంవత్సరం లక్ష బియ్యపు గింజలపై స్వామివారి పేరును మూడు భాషలలో రాసి ఆలయానికి అందజేసినట్లు ద్వారంపూడి యువ రాజారెడ్డి తెలిపారు. తలంబ్రాల తో పాటు స్వామివారి కల్యాణం లో వినియోగించే కొబ్బరి బండలపై శంకు చక్రాలు, స్వామివారి మూల విరాట్ ను రంగులతో తీర్చిదిద్దారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kakinada, Local News, Srirama navami