P Ramesh, News18, Kakinada
ఒకప్పుడు దొంగతనం అంటే చిన్న చిన్న వస్తువులు, డబ్బులు, నగదు కానీ దొంగల తీరు మారింది. వారు చేస్తున్న దొంగతనాలు చూస్తుంటే షాక్ అవుతున్నారు పోలీసులు. సాంకేతికతను వారు అంది పుచ్చుకుంటున్నారు. సులువుగా డబ్బులు ఏలా సంపాదించాలన్న చిన్న ఆలోచన దొంగతనాల వైపు మళ్లిస్తోంది. ఇంకేముంది అనుకున్నదే తడవుగా సులువుగా ఫోన్లు కొట్టేస్తున్నారు. కాకినాడ జిల్లా (Kakinada District) లో ఈ తరహా దొంగతనాలు బాగా పెరిగిపోయాయి. ఒకపక్క పోలీసులు అరెస్టు చేస్తున్నా ఎక్కడా క్రైమ్ రేటు తగ్గడం లేదు. ఎవరి పని వారిదే అన్నట్టుగా మారింది ప్రస్తుతం దొంగల పరిస్థితి. ఇటీవల కాలంలో అన్నవరం, కాకినాడ, తుని, సామర్లకోట తదితర ప్రాంతాల్లో ఉన్న రైల్వే స్టేషన్లలో ఛార్జింగ్ పెట్టిన ఫోన్ కనిపించకుండా పోయాయి.
దీనిపై చాలా మంది జిఆర్పీ పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చారు. దీనిపై విచారణ చేసిన పోలీసులు 13 లక్షల విలువైన 54 సెల్ ఫోన్లు, 9 బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా వారు చెప్పిన నిజాలు విని రైల్వేపోలీసులే షాక్ తిన్నారు. వివిధ ప్రాంతాలలో చాకచక్యంగా వ్యవహరిస్తూ సెల్ ఫోన్లు బైకులు దొంగతనం చేసే వీరిని అరెస్ట్ చేసినట్లు ప్రత్తిపాడు సీఐ కె. కిషోర్ బాబు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం తుని మండలం కొలిమేరు గ్రామానికి చెందిన బొందల అప్పారావు, ఎస్ కోట మండలం కొత్తవలస గ్రామానికి చెందిన బోధల సురేష్ వీరిద్దరూ గ్రామీణ ప్రాంతాలలో రాత్రి వేళల్లో దొంగతనాలు చేస్తూ మోటార్ సైకిళ్లు సెల్ ఫోన్లు అపహరించుకుపోతున్నట్లు పోలీసులు తెలిపారు. అన్నవరం, తుని, సామర్లకోట ప్రాంతాలలోని రైల్వే స్టేషన్లలో చార్జింగ్ పెట్టుకున్న ప్రయాణికుల సెల్ ఫోన్లు దొంగలించడం వీరికి పరిపాటిగా మారిందన్నారు.
దొంగిలించిన సెల్ ఫోన్ల యొక్క లాకులను తెరిచేందుకు యూట్యూబ్ లో చూసి లాకులను తెరిచి అందులోని డేటా మొత్తాన్ని తొలగించి వేరే ప్రాంతాల వ్యక్తులకు తక్కువ ధరలకు అమ్మకాలు చేస్తూ జల్సాలు చేయడం వీరికి అలవాటుగా మార్చుకున్న వీరు దొంగతనాలు వరుసగా చేయడంతో చివరకు చిక్కినట్టు వెల్లడించారు. వీరిని పట్టుకునేందుకు ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన ప్రత్తిపాడు, ఏలేశ్వరం, అన్నవరం పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించి 9 మోటార్ బైకులు, 54 సెల్ ఫోన్ లను పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.
ఇలాంటి ఘటనల నేపథ్యంలో ప్రయాణాలు చేసే వారు చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. దూర ప్రాంతాలు ప్రయాణాల్లో ఉండగా రైల్వే స్టేషన్లు, బస్స్టేషన్ల వద్ద ఛార్జింగ్లు పెట్టినప్పుడు దగ్గరే ఉండాలన్నారు. మాయగాళ్లు మాయమాటలు చెప్పి సులువుగా ఫోన్లు పట్టుకుపోతుండాన్ని గుర్తించాలి. అలాగే చుట్టూ ఉండే వ్యక్తులు తెలిసిన వారా..కొత్త వారా అనే దానిపై అప్రమత్తత పాటించకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తోందని గుర్తు చేస్తున్నారు పోలీసులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East Godavari Dist, Kakinada, Local News