2019 ఎన్నికల్లో జనసేన (Janasena) నుంచి గెలిచిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కొన్ని నెలలకే వైసిపి పంచన చేరారు. అప్పటి నుంచీ నియోజకవర్గంలో పార్టీ పగ్గాలు తన చేతికి వచ్చేలా చేసిన రాపాక ప్రయత్నాలు ఫలించలేదు. అయితే ఇటీవలే సీఎం జగన్ రాజోలు ఇన్ ఛార్జ్ బాధ్యతలను ఎమ్మెల్యే రాపాకకు అప్పగించారు. అప్పటి నుంచీ నియోజకవర్గ పార్టీలో ఆయన చేస్తున్న మార్పులు పార్టీని ముందు నుంచి నమ్ముకున్న క్యాడర్ కు మింగుడు పడటంలేదట. జనసేన నుంచి రాపాకతో వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు కీలకమైన పార్టీ పదవులను కూడా కట్టబెట్టేయడం వైసిపి క్యాడర్ అసమ్మతికి కారణం అవుతోందని తెలుస్తోంది.
కొత్త కోఆర్డినేటర్లు.. జిల్లా అధ్యక్షులు.. ఇంచార్జ్ మంత్రులను నియమించిన తరువాత అమలాపురంలో జరిగిన రాజోలు నియోజకవర్గ సమస్వయ కమిటీ సమావేశానికి మాజీ కోఆర్డినేటర్లు బొంతు రాజేశ్వరరావు, పెదపాటి అమ్మాజీలను కాదని పార్టీ పెద్దలు ఎమ్మెల్యే రాపాకను ఆహ్వానించారు. అయితే అప్పుడే రెండు వర్గాలకు చెందిన కార్యకర్తలతో పాటు కీలకమైన వైసిపి నేతలు రాపాక రాకను తీవ్రంగా వ్యతిరేకించారు. అయినప్పటికీ అధిష్టానం రాపాకను ఇంఛార్జ్ గా నియమించింది. అయితే తాజాగా రాజోలు నియోజకవర్గంలో వరుసగా వైసిపి నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. సఖినేటిపల్లి, మామిడికుదురు మండలాల్లో పార్టీ ఆవిర్భావం నుంచీ వైసిపిలో ఉన్న నాయకులు రాజీనామాలు చేశారు.
మాజీ సీఎం దివంగత వైఎస్ కు అత్యంత సన్నిహితుడైన రుద్రరాజ వెంకటరాజు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయనతో పాటు మరో వెయ్యి మంది అనుచరులను పార్టీకి రాజీనామా చేయించారు. ఇదే బాటలో మామిడికుదురు మండలానికి చెందిన వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి సాగి రామరాజుతో పాటు నియోజకవర్గ బూత్ కమిటీ ఇంఛార్జ్ సుందరపు బుల్లబ్బాయి తమ పదవులకు రాజీనామా చేశారు.. అంతేకాదు రాపాక నాయకత్వానికి వ్యతిరేకిస్తున్న మరికొందరు నేతలు సైతం వైసిపికి రాజీనామాలు చేస్తామనే సంకేతాలు ఇస్తున్నారట. రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితిని పరిశీలించి.. నాయకత్వంపై పునరాలోచించాలని పలువురు పార్టీ నేతలు పార్టీ ఇంఛార్జులను కొరినట్టు తెలుస్తోంది.
గత ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన.. టిడిపి.. పరోక్ష పొత్తు కారణంగా రాజోలు.. మలికిపురం మండలాల్లో ఎంపిపి.. జడ్పిటిసి స్థానాలను అధికార పార్టీ దక్కించు కోలేకపోయింది. పార్టీ బలంగా ఉన్న సఖినేటిపల్లి, మామిడికుదురు మండలాల్లో తాజాగా రాజీనామాల కారణంగా వైసిపి పట్టు తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తోంది. పార్టీ కోసం ముందు నుంచీ కష్టపడిన వారికి కాదని ఎమ్మెల్యే రాపాక వెంట పార్టీలోకి వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత దక్కుతుందనేది అక్కడ క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. రాజోలు నియోజకవర్గంలో గత ఎన్నికలు తరువాత పార్టీ నాయకత్వంలో మార్పులు జరిగాయి. దీంతో క్యాడర్ కూడా మూడు ముక్కలైన పరిస్థితి నెలకొంది. అయితే ఏనాడు పార్టీ అధినాయకత్వాన్ని ధిక్కరించిన పరిస్థితులు తలెత్తలేదు. అయితే తాజాగా చేసిన మార్పుల కారణంగా క్యాడర్ గుర్రుగా ఉండటంతో పాటు పార్టీని వీడేందుకు కూడా వెనుకాడటం లేదని సమాచారం. రాజోలు నియోజకవర్గంలో వేగంగా జరుగుతున్న పరిణామాలను అధీష్టానం దృష్టికి తీసుకువెళ్లిన కొందరు సీనియర్లు పరిస్థితిని పరిశీలించి పునరాలోచించాలని కోరినట్టు తెలుస్తోంది.
రాజోలు నియోజకవర్గంలో జరుగుతున్న రాజీనామాల పర్వం.. ఇతర పరిణామాలను నిశితంగా గమనిస్తున్న వైసిపి పెద్దలు ఇప్పటికిప్పుడు నాయకత్వం మార్పుపై నిర్ణయం తీసుకోకపోయినా రానున్న రోజుల్లో సమయానుకూలంగా వ్యవహరిస్తారని కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. పార్టీని వీడిన నాయకుల మాటెలా ఉన్నఇక పై రాజీనామాలు.. అసంతృప్తులను బుజ్జగించేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అమలాపురం పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్న చింతా అనురాధను రాజోలు నుంచి వచ్చే ఎన్నికల్లో బరిలో దించాలనే అంశంపై అక్కడి క్యాడర్ తో సమాలోచనలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అందుకు పార్టీ అవిర్భావం నుంచి సేవలు చేసిన ముఖ్యనేతలతో ఇప్పటికే చర్చించారట పార్టీ పెద్దలు. అధీష్టానం నిర్ణయంతో రాజోలు వైసిపిలో నెలకొన్న వివాదం సద్దమణుగుతుందని క్యాడర్ భావిస్తుంటే... వచ్చే ఎన్నికలకు రాపాక భవితవ్యం ఏంటనేది పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East Godavari Dist, Rapaka varaprasad, Ysrcp