P Ramesh, News18, Kakinada
ఎండకాలం (Summer) వచ్చేసింది. ఎక్కడ చూసినా దాహం..దాహం. కానీ తాగేందుకు నీరుందా అంటే అది అనుమానమే. పట్టణాల్లో కష్టాలు మొదలయ్యాయి. నగరాల్లో ఇప్పుడిప్పుడే సర్థుబాటు చేసుకుంటున్నారు. ఒక పక్క వేడి తాపంతో ఇబ్బందులు పడుతుంటే మరోపక్క నీటి సరఫరాకు అష్టకష్టాలు పడుతున్నాయి ఆయా లోకల్ బాడీలు. పాలకులున్నా నిధులు లేవు. ప్రభుత్వం చొరవ చూపితే తప్పితే ప్రస్తుతం తాగునీటి ఇక్కట్ల నుండి బయటపడేలా లేదనే వాదన బలంగా వినిపిస్తోంది. మొత్తం మీద ఒక్క ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) లో ఉన్న పరిస్థితి చూస్తే ఆందోళన మొదలైంది.
వేసవిలో ఎలాంటి నీటి ఎద్దడి లేకుండా పూర్తిస్థాయిలో మంచినీటిని అందించగలిగే సామర్థ్యం కలిగి ఉన్నామని కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సీహెచ్ నాగనరసింహారావు స్పష్టం చేశారు. కాకినాడ వాటర్ వర్క్స్ పనులను పరిశీలించిన ఆయన, అధికారులతో కలిసి అరట్లకట్ట వేసవి జలాశయాన్ని కూడా సందర్శించారు. గోదావరి జలాల అందుబాటుపై ఇరిగేషన్ అధికారులతో చర్చించారు. ఏప్రిల్ 25వ తేదీ వరకు గోదావరి జలాలతో వేసవి జలాశయాలను పూర్తిస్థాయిలో నింపుకునే అవకాశంఉందన్నారు.
కాకినాడ ప్రజలకు పూర్తిస్థాయిలో నీరు అందించేందుకు అరట్లకట్టలో 1582 ఎంఎల్డీ, సామర్లకోట సాంబమూర్తి రిజర్వాయర్లో 832 ఎంఎల్డీ నీటి సామర్థ్యం ఉందన్నారు. మరమ్మతుల కోసం కాలువలను మూసి జూన్లో తిరిగి తెరిచే వరకు వాసవి జలాశయాలలో నీటి సామర్థ్యం పూర్తిస్థాయిలో ఉంటుందని ఏడీసీ చెప్పారు. నీటిని తోడేందుకు ఉన్న రెండు జనరేటర్ల కు తోడు మరో రెండు అదనపు జనరేటర్లను కూడా ఏర్పాటు చేసి పంపింగ్ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేయనున్నట్లు అదనపు కమిషనర్ వెల్లడించారు. అలాగే వేసవి కార్యాచరణలో భాగంగా మరికొన్ని ప్రత్యేక పనులు కూడా చేపట్టామన్నారు. ఇవన్నీ పూర్తయితే గతానికన్నా మరో 10 రోజులపాటు వేసవిలో అదనంగా నీరందించే సామర్థ్యం కలిగివుంటామన్నారు. వేసవి కార్యాచరణపై ఆయన వాటర్స్ వర్క్స్ అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఏడీసీ వెంట వాటర్వర్క్స్ డిఈ ప్రభాకర్పనులు పరిశీలించిన వారిలో ఉన్నారు.
రానున్న రోజుల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మున్సిపాల్టీలో తాగునీటి సరఫరాపై ముందస్తు ప్రణాళికలతో మున్సిపాల్టీలు సిద్దపడ్డాయి. అయితే నిధులు విడుదలలో మాత్రం ప్రభుత్వం జాప్యం చేయడంతో ముందస్తుగా సొంత డబ్బులు ఖర్చు పెట్టడానికి మున్సిపాల్టీ అధికారులు సాహాసం చేయడం లేదు. ఒకప్పుడు సాధారణ పనులకు డబ్బులు ఖర్చు చేసే అధికారం కమిషనర్లకు ఉండేది. కానీ ఈ సర్కారులో ఆ అవకాశం లేదు. ప్రతీ దానికి బిల్లు పెట్టాలి. సీఎఫ్ఎమ్ ఎస్ సిస్టమ్ ద్వారా బిల్లు ఆప్లోడ్ అయితే తప్ప నిధులు రావు.
దీంతో చేయాల్సిన పనులు మూలకు చేరుతున్నాయి. ప్రస్తుతం ఈ విధానంలో తాగునీటి సరఫరా అంటే కష్టతరంగా మారిందనే చెప్పాలి. ప్రభుత్వం తాగునీటి పనులకు సంబంధించి నిధులు విడుదల చేయకపోతే ఈ వేసవిలో కూడా దాహం తీర్చే దారులన్ని మూసుకుపోతాయన్న ఆందోళన ఉమ్మడి తూర్పుగోదావరి వాసుల్ని వెంటాడుతుంది. మరి ప్రభుత్వం ఏలాంటి చర్యలు తీసుకుంటుందనేది వేచి చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East Godavari Dist, Kakinada, Local News