కోనసీమ అంటే రాజకీయాలకు పెట్టింది పేరు. ఇక్కడ కుల సమీకరణాలతోనే పొలిటికల్ గేమ్ మొదలవుతోంది. రెండు ప్రధాన సామాజిక వర్గాలు బలబలాలను ప్రదర్శిస్తుంటాయి. ప్రస్తుతం ఎక్కువగా ఇక్కడ ఇటీవల ఓ సామాజిక వర్గం పూర్తిగా జనసేన వైపు మళ్లింది. అధికార పక్షం వైపు మరో వర్గం కొమ్ము కాస్తోంది. మొత్తం మీద కుల సమీకరణాల బేరిజులో జగన్ వేసిన ఎత్తులకు రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఒకే ప్రాంతానికి రావడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అసలు ఎమ్మెల్సీలుగా ఎంపికైన అభ్యర్థులు ఎవరనేది చూస్తే..సమీకరణాలు ఇలా ఉన్నాయి.
చిన్నపాటి కార్యకర్త నుంచి మండల, నియోజకవర్గ స్థాయి నాయకుడిగా ఎదిగిన బొమ్మీ ఇజ్రాయిల్ కు ఎమ్మెల్సీ పదవి వరింది. అల్లవరం మండలం గోడి గ్రామానికి చెందిన బొమ్మి ఇజ్రాయిల్ అతి సాధారణ కుటుంబంలో జన్మించారు. స్టూడెంట్ దశ నుంచి రాజకీయ, సాంఘిక అంశాలలో చురుగ్గా పాల్గొ ని నేడు ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్న నాయకుడిగా ఎదిగారు. దళిత సమస్యలపై ముందుండి పోరాటం చేసే వ్యక్తులలో ఇజ్రాయిల్ ఒకరుగా పేరు తెచ్చుకున్నారు. డిగ్రీ పూర్తి చేసిన ఇజ్రాయిల్ తదనంతరం మొదట తెలుగుదేశం పార్టీలోను తరువాత వైసిపి పార్టీలలో చేరి క్రియాశీలకంగా పని చేశారు.
ఆయనకు కుమారుడు,కుమార్తె ఉన్నారు.ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరపున క్రియాశీలకంగా పనిచేశారు. అప్పటినుంచి మాదిగ సామాజిక వర్గం నేతగా నియోజకవర్గంలో తనకంటూ ఒక స్థానాన్ని నిలుపుకున్నారు. సొంత మాదిగ సామాజిక వర్గ ఎంపీ అయిన కృష్ణా జిల్లాకు చెందిన నందిగామ సురేష్ తో ఆయనకు సత్ససంబంధాలు ఉన్నాయి. కులాల సమీకరణ నేపథ్యంలో ఇజ్రాయులను ఎంపీ సురేష్ సీఎం జగన్ కు పరిచయం చేసి ఎమ్మెల్సీ ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. ఆయనే అన్ని తానై ఇజ్రాయులకు ఎమ్మెల్సీ వచ్చేలా కృషి చేశారని సమాచారం. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానం ఇజ్రాయిల్ ను వరించింది.
ఎమ్మెల్సీగా కూడుపూడి సూర్యనారాయణరావు..
ఎమ్మెల్సీగా నామినేట్ చేయబడిన కూడిపూడి సూర్యనారాయణ రావు ఉన్నత కుటుంబంలో జన్మించారు. బిసి చెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన సూర్యనారాయణరావు యం ఎ, ఎల్ ఎల్ బి వంటిఉన్నత చదువులు చదువారు. అమలాపురంలో శెట్టిబలిజ సామాజిక వర్గంలో సూర్యనారాయణరావుకు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయంగా, సాంఘికంగా వెనుకబడిన వర్గాల విషయంలోనూ జరిగే ఉద్యమాలలో సూర్యనారాయణ రావు క్రియాశీలకంగా ముందుంటారు.ఆయన తండ్రి గోపాలకృష్ణ గోకలే రాష్ట్ర డిఐజిగా పనిచేసారు. తెలుగుదేశం ప్రభుత్వం హయంలో సూర్యనారాయణ రావు రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్మన్ గా పనిచేశారు. అనంతరం ఆయన రాజకీయాల్లో అంతంతమాత్రంగానే ఉన్నారు.
వ్యూహం ఫలించేనా..
బీసీ, ఎస్సీ సామాజిక సమీకరణలలో వైసీపీ వేస్తున్న ఎత్తులకు ప్రతిపక్షాలు చిత్తవుతాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కోనసీమలో ఎస్సీ, ఓసీ సామాజిక వర్గాల ప్రభావం ఎక్కువ. ఇక్కడ కాపులు వైసీపీకి పూర్తిగా దూరమయ్యారనే చెప్పాలి. మొన్నటి కోనసీమ అల్లర్ల దగ్గర నుండి అక్కడ జనసేన గాలి బలంగా వీస్తోంది. ఈనేపథ్యంలో ఎస్సీలు పూర్తిగా ఓ తాటిపైకి వచ్చే అవకాశాలున్నాయి. ఏలాగూ ఓసీ ఓటర్ల చీలక ఉండే అవకాశాలు లేకపోలేదు. ఈనేపథ్యంలో ఎస్సీ సామాజిక వర్గానికి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంలో భాగంగా ఇజ్రాయేల్కు పదవి వరించినట్లు పొలిటికల్ విశ్లేషకులు అంచనా. ఇదిలా ఉంటే బీసీ సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకోవాలనే ఉద్దేశ్యంతో పూర్తిగా బీసీ, ఎస్సీలకే ఎక్కువ అవకాశాలు అనే విధంగా ఎమ్మెల్సీలు కోనసీమలో రెండు కేటాయించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా రాబోవు ఎన్నికలకు వైసీపీ వేస్తున్న పొలిటికల్ ఎత్తుగడలు ఏ మేరకు ఫలిస్తాయన్నది వేచి చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East godavari, Local News, Ysrcp