P Ramesh, News18, Kakinada
ప్రభుత్వం ఏర్పడి మూడున్నరేళ్లు..రాష్ట్రంలో ఇళ్లు నిర్మాణాల లక్ష్యం 30 లక్షలు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే అధ్వాన్నం. ఎందుకలా జరుగుతోంది. అనుకున్న లక్ష్యం చేధించడంలో లోపాలు ఎక్కడా ఇవి ప్రస్తుతం ప్రభుత్వాన్ని వేధిస్తున్న ప్రశ్నలు. అందుకే జిల్లాల వారీగా హౌసింగ్ పై దృష్టిపెట్టిన ప్రభుత్వం ఎక్కడికక్కడ సమీక్షలు చేస్తోంది. తాజాగా కాకినాడ జిల్లాలో హౌసింగ్ నిర్మాణాలపై కసరత్తును వేగవంతం చేస్తున్నారు. కాకినాడ (Kakinada) గ్రామీణ నియోజకవర్గం నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించిన హౌసింగ్ లేఔట్ పనులు, జగనన్న కాలనీలలో మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు దృష్టిపెట్టాలని జిల్లా కలెక్టరు డా. కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు.
కాకినాడ రూరల్ నియోజకవర్గం హౌసింగ్ కి సంబంధించి నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద చేపట్టిన గృహ నిర్మాణాలు, లేఔట్ల లెవెలింగ్, స్టోన్ ప్లాంటేషన్, అంతర్గత రహదారులు, కల్వర్టుల నిర్మాణం, ఎస్హెచ్జీ రుణాల మంజూరు తదితర అంశాలపై ప్రత్యేకంగా జిల్లా కలెక్టరు కృతికా శుక్లా ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించారు. హౌసింగ్ పీడీ బి.సుధాకర్ పట్నాయక్, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ కె.రమేష్, డీఆర్డీఏ పీడీ కె.శ్రీరమణి, డ్వామా పీడీ ఎ.వెంకటలక్ష్మి, కాకినాడ డీఎల్డీవో పి.నారాయణ మూర్తి తదితరులతో కలిసి జరిగిన సమీక్షలో పలు నిర్ణయాలను తీసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పేదల గృహ నిర్మాణాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టినందున గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని, కాకినాడ గ్రామీణ నియోజకవర్గం లబ్ధిదారులకు కేటాయించిన హౌసింగ్ లేఔట్ పనులు, జగనన్న కాలనీలలో మౌలిక సదుపాయాల కల్పనకు అధికారులు చొరవ చూపాలన్నారు కలెక్టర్. ఇందుకు హౌసింగ్, ఎలక్ట్రిసిటీ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రధానంగా లేఅవుట్లలో ఇంకా మిగిలిన లెవెలింగ్, స్టోన్ ప్లాంటేషన్, అంతర్గత రహదారులు, కల్వర్టుల పనులు చేపట్టాలన్నారు. పనులు పూర్తయిన వెంటనే బిల్లులు అప్లోడ్ చేయాలని ఆదేశించారు. గృహ నిర్మాణ పనుల్లో పునాది దగ్గర నుంచి ఇంటి నిర్మాణం పూర్తయిన వరకు నాణ్యతా ప్రమాణాలు పాటించే విధంగా క్షేత్రస్థాయి అధికారులు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టరు కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో సుమారుగా 32 వేల ఇంటి పట్టాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు కృషి చేయాలన్నారు. కాకినాడ గ్రామీణ నియోజకవర్గానికి సంబంధించి నేమాం, పండూరు, తిమ్మాపురం, సూర్యారావుపేట, తూరంగి, కరప, అరట్లకట్ట తదితర గ్రామాల్లో సిద్ధం చేసిన లేఔట్లలో లబ్ధిదారులకు ఇంటి పట్టాలు మంజూరు చేయడం జరిగిందన్నారు ఎమ్మెల్యే కన్నబాబు. లక్ష్యాలకు అనుగుణంగా లేఅవుట్లలో పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. జగనన్న కాలనీలలో విద్యుత్ సరఫరా అందించేందుకు అవసరమైన స్తంభాలను ఏర్పాటు చేయడంతో పాటు పూర్తయిన గృహాలకు వెంటనే తాగునీరు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kakinada, Local News